వికారాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైనది. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వాటి నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నది. వైద్యారోగ్య సిబ్బంది ఊరూరా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తునున్నారు. పరిసరాల శుభ్రత, రోగాల నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను వివరిస్తున్నారు. గ్రామ పంచాయతీలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో గతేడాది జనవరి నుంచి జూన్ వరకు 203 డెంగీ కేసులు నమోదుకాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం 3 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో జిల్లాలో చాలా వరకు సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.
సీజనల్ వ్యాధులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షాలు పడుతుండడంతో డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధులు ప్రబలే అవకాశమున్న దృష్ట్యా సంబంధిత వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లాలో గతంలో మాదిరిగా సీజనల్ వ్యాధులు నమోదు కాకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అప్రమత్తం చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఊరూరా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతేడాది జిల్లాలో జనవరి నుంచి జూన్ వరకు 203 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు కేవలం 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మలేరియా కేసులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో జిల్లాలో చాలా వరకు సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే చాలు ఊరు ఊరంతా రోగాల బారిన పడే పరిస్థితులుండేవి. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి ఏటా గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేపడుతున్న స్వచ్ఛ్ కార్యక్రమాలతో సీజనల్ వ్యాధులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలు, వ్యాధుల నివారణకు వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే గ్రామాల్లోనూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను కూడా చేపడుతున్నారు. వ్యాధి లక్షణాలను ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరం, జలుబు, తలనొప్పి తదితర లక్షణాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆయా వ్యాధి లక్షణాలను బట్టి నేరుగా ఇంటి వద్దనే ఉచితంగా మందులను అందిస్తున్నారు. ఒకవేళ మూడు, నాలుగు రోజులైనా తగ్గకపోయినట్లయితే సంబంధిత వ్యక్తుల రక్త నమూనాలను సేకరించి, పరీక్షలకు పంపనున్నారు. డెంగీ, మలేరియాగా నిర్ధారణ అయినట్లయితే ప్లేట్లెట్స్ తగ్గకుండా ప్రత్యేక చికిత్స అందించనున్నారు. డెంగీ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లోని చుట్టుపక్కల ఇండ్లలో ప్రత్యేక సర్వే చేపట్టి డెంగీ లక్షణాలున్నట్లయితే రక్త నమూనాలను సేకరించి అవసరమైన చికిత్స అందించన్నారు. ఇందుకుగాను జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లోనూ చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచేలా జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో డయేరియా వ్యాధిని అరికట్టేందుకు గ్రామాల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా నీరు కలుషితం కావడంతోనే డయేరియా వచ్చే ప్రమాదముందని అవగాహన కల్పించడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లను అందించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
పల్లెప్రగతితో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం
స్వచ్ఛ గ్రామపంచాయతీలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గత రెండు, మూడేండ్లుగా డెంగీ, మలేరియా కేసులతోపాటు ఇతర సీజనల్ వ్యాధులు చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. వానకాలం ప్రారంభానికి ముందు రోడ్లు, మురుగు కాల్వలను పరిశుభ్రం చేయడం, ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై పారకుండా ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహించడం, శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించడం, గ్రామాల్లో పాడుబడిన బావులు, నిరుపయోగ బోరుబావులను పూడ్చివేయడం వంటి కార్యక్రమాలతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెరిగి సీజనల్ వ్యాధులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వే ;- జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పడాక్టర్ పల్వన్కుమార్
జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు అవసరమైన చర్యలు చేపట్టాం. ప్రజలను అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ఫీవర్ సర్వేను కూడా చేయిస్తున్నాం. అవసరమైన ఏర్పాట్లు చేపట్టాం. ఇండ్లు, ప్రభుత్వ సంస్థల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడానికి ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నాం. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి.