తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పొట్టేలును ఇస్తూ వారి జీవనోపాధికి తోడ్పడుతున్నది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 11,965 మందికి గొర్రెల యూనిట్లను అందించగా, గొర్రెలు రెట్టింపై ఆర్థికంగా వృద్ధి చెందుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడుతలోనూ జిల్లాకు 30,009 యూనిట్లను అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ‘మే’ మొదటి వారం నుంచి దశల వారీగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలు ఉండగా, పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని రెండో విడుతలో ఒక్కో యూనిట్కు రూ.1.75 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. జిల్లాలో 384 సొసైటీలు ఉండగా, 41,945 మంది సభ్యులు ఉన్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కుల వృత్తులను పునరుద్ధరిస్తున్నది. సమాజంలోని వివిధ వృత్తుల వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ప్రధానంగా గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో జీవాల పెంపకంపై ఆధారపడిన గొల్ల కురుమలకు ప్రభుత్వం రాయితీలిస్తూ వారికి జీవాలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడుతలో సబ్సిడీపై జీవాలను పంపిణీ చేసింది. కాగా, జిల్లా వ్యాప్తంగా రెండో విడుత పంపిణీ చేసేందుకు జిల్లా అధికార యం త్రాంగం కసరత్తు చేస్తున్నది. మొదటి విడతలో పంపిణీ చేసిన జీవాలతో పెంపకందారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. అయితే, జిల్లా వ్యాప్తంగా గతంలో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన యూనిట్ ధర రూ.1.25 లక్షలు ఉండగా, ప్రభుత్వం దానిని రూ. 1.75 లక్షలకు పెంచింది. ఇటీవల పెరిగిన ధరల నేపథ్యంలో పెంపకందారులపై భారం పడకుండా గతంలో ఉన్న సబ్సిడీని రూ.93 వేల నుంచి రూ.1.31,750 లక్షలకు పెం చింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారుల వాటాను పెంచినట్టుగానే సబ్సిడీని సైతం 75% పెంచడంతో పెంపకందారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 384 సొసైటీలు ఉండగా, 41,945 మంది సభ్యులు ఉన్నారు. మొదటి విడుతలో సుమారు రూ.150 కోట్ల విలువైన 11,965 యూనిట్లను పంపిణీ చేసిన సర్కారు రెండో విడుత పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నది. మొదటి విడుతలో మిగిలిపోయిన లబ్ధిదారులను కలుపుకొని రెండో విడుతలో 30,009 మంది లబ్ధిదారులకు జీవాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు రూ.525 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నది. గతంలో గొల్ల కురుమల సొసైటీలు స్థాపిం చుకోవాలంటే పెద్ద తంతే ఉండేది.ప్రస్తుతం గొర్రెల పెంపకందారుల సొసైటీల ఏర్పాటుకు నిబంధనలను సరళతరం చేశారు. ఫలితంగా పైసా ఖర్చు లేకుండా సభ్యత్వ రుసుముతో గ్రామాల్లో సొసైటీలు ఏర్పడ్డాయి. 18 ఏండ్లు నిండిన వారంతా సొసైటీల్లో సభ్యత్వం తీసుకున్నారు. త్వరలోనే రెండో విడుత గొర్రెల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పశు సంవర్ధక శాఖ లబ్ధిదారులను డీడీలు కట్టించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ 30 తరువాత పంపిణీకి మార్గం సుగమం కానున్నది.
పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి
రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీకి కార్యా చరణ షురూ చేశాం. అయితే, యూనిట్ ధరను ప్రస్తుత పరిసి తులకు అనుగుణంగా రూ.1.25 లక్షల నుంచి (దాణా, రవా ణా, ఇన్సూరెన్స్, మందులు కలుపుకొని) రూ. 1.75 లక్షలకు ప్రభుత్వం పెంచింది. తొలి విడుతలో మిగిలిన లబ్ధిదా రుల తో పాటు ప్రస్తుతం ఎంపిక చేసిన వారికి పారదర్శకంగా యూనిట్లను అందజే య నున్నాం. రెండో విడుతలో 30,009 యూనిట్లను అందజేసేందుకు కసరత్తు ప్రారం భించాం. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయా యూనిట్లపై సదస్సులు ఏర్పా టు చేసి లబ్ధి దారులకు గొర్రెల పంపిణీపై ఒక అవగాహన తీసుకురానున్నాం.దాదాపు మే మొదటి వారంనుంచి పంపిణీ కార్యక్రమం షురూ కానుంది.
– అంజిలప్ప, జేడీ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, రంగారెడ్డి జిల్లా