రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. అసహాయులకు మరింత ఆసరా కల్పించాలని దివ్యాంగుల పింఛన్ను పెంచి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. అభాగ్యులైన దివ్యాంగులకు మరింత ఆర్థిక భరోసాను కల్పించి పెద్ద దిక్కులా నిలుస్తున్నారు. ముచ్చటగా మూడోసారి పింఛన్ను పెంచి ఈ నెల నుంచే అమలు చేయాలని ఉత్తర్వులను సైతం జారీ చేశారు. ఇప్పటివరకు ఇస్తున్న రూ.3016 పింఛన్ను రాష్ట్ర సర్కార్ తాజాగా రూ.4016కు పెంచింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో 30,949 మందికి, వికారాబాద్ జిల్లాలో 12,806 మందికి లబ్ధి చేకూరనున్నది. దివ్యాంగుల పింఛన్ నిమిత్తం రెండు జిల్లాలకు కలిపి ఇప్పటి వరకు ప్రతి నెలా రూ.97.24 కోట్లను ఖర్చు చేస్తుండగా, మరో రూ.5.42 కోట్లను తెలంగాణ సర్కార్ అదనంగా వెచ్చించనున్నది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఫించన్కు అర్హులు. వార్షిక ఆదాయ పరిమితి కూడా ఏ రాష్ట్రం ఇవ్వని రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు పెంచడం విశేషం. సీఎం కేసీఆర్ మానవీయతకు ఇది నిలువెత్తు నిదర్శనమని జనం జేజేలు పలుకుతుండగా, దివ్యాంగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మరోమారు ఆసరాను పెంచి చేయూతనందిస్తున్నారు. ఇప్పటివరకు దివ్యాంగులకు నెలనెలా రూ.3,016 పింఛన్ ఇస్తుండగా.. పెంచిన రూ.4,016 పింఛన్ను జూలై నెల నుంచే వర్తింపజేయనున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30,949 మందికి లబ్ధి చేకూరనున్నది. దివ్యాంగుల కోసమే రూ.93.34కోట్లను వెచ్చిస్తున్న ప్రభుత్వంపై మరో రూ.4కోట్ల వరకు అదనపు భారం పడనున్నది. దివ్యాంగులు ఆదివారం జిల్లావ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
ఇప్పటివరకు ఫించన్ కోసం రూ.93.34కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఇకపై అదనంగా రూ.4కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. పెంచిన ఫించన్కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లావ్యాప్తంగా దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సర్కార్ 40శాతం కంటే ఎక్కువగా వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ను అందిస్తున్నారు. జిల్లాలోని 30,949 మంది దివ్యాంగుల్లో భరోసాను నింపుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా దివ్యాంగులకు మరింత చేయూతను అందించేందుకు పింఛన్ డబ్బులను పెంచుతూ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం రూ.4,016లకు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల నుంచే అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 12,806 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనున్నది. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.3016లు పింఛన్ అందజేస్తుండగా, ప్రతినెలా రూ.3.90 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. పెంచిన పింఛన్ డబ్బులతో అదనంగా ప్రతినెలా రూ.5.32 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నది. రూ.వెయ్యి పెంపుపై జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా అంతటా దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు. అయితే పింఛన్ల నిమిత్తం గత ప్రభుత్వాలు నెలకు కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేయగా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొదట నెలకు రూ.12 కోట్ల మేర పింఛన్ల నిమిత్తం ఖర్చు చేసింది. వయోపరిమితి తగ్గించిన నేపథ్యంలో నెలకు రూ.26కోట్ల మేర ఖర్చు చేస్తుండగా, ఈ నెల నుంచి రూ.2 కోట్ల మేర పెరుగనున్నది. జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్దారులు మొత్తం 1,10,983 మంది ఉండగా వృద్ధాప్య పింఛన్దారులు-42,384, వితంతువులు-50,508, దివ్యాంగులు-12,806 మంది, చేనేత కార్మికులు-147, కల్లుగీత కార్మికులు-432 మంది, బీడీ కార్మికులు-39 మంది, ఒంటరి మహిళలు 4667 మంది ఉన్నారు.
పింఛన్తో ఎంతో ఆసరా
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడగక ముందే దివ్యాంగులకు రూ.4016ల వరకు పింఛన్లను పెంచారు. గత ప్రభుత్వ పాలకుల హయాంలో దివ్యాంగులు ఆత్మగౌరవాన్ని కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్లను అందిస్తూ ఆసరాగా నిలిచింది. దివ్యాంగుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– సోమ చంద్రశేఖర్యాదవ్, సురంగల్, మొయినాబాద్
చాలా సంతోషకరం..
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దివ్యాంగులకు రూ.3016 నుంచి రూ.4016కు పెన్షన్ పెంచడం చాలా సంతోషకరంగా ఉంది. గత ప్రభుత్వాలు రూ.500 మాత్రమే అందించేవి. తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు గౌరవంగా బతుకుతున్నారు. సీఎం కేసీఆర సార్కు ధన్యావాదాలు.
-మన్నె చంద్యయ్య, ఎన్కతల, మోమిన్పేట
సారు సల్లగా ఉండాలె
నాకు ఒక కాలు పూర్తిగా ఇబ్బందిగా ఉంటది. నడవటానికి కూడా చేతకాకుండా ఉంది, కాంగ్రెసోళ్లు ఇచ్చే పింఛన్ సాలీసాలక ఇబ్బందులు పడేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయినంక ముఖ్యమంత్రి కేసీఆర్సారు రూ.3016ప్రకటించి ఆదుకున్న గొప్ప నాయకుడు. అలాగే, రూ.4016లు అందిస్తానని మొన్న ప్రకటించాడని మా తమ్ముడు చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది.
– పగిళ్ల సత్యమ్మ, దివ్యాంగురాలు (ఇబ్రహీంపట్నంరూరల్)
కేసీఆర్ మా దేవుడు
సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడు. అంధులమైన మేము ఏ పనీ చేయలేము. మాకు ఆర్థిక పరంగా పింఛన్ ద్వారా సీఎం కేసీఆర్ చేయూత అందిస్తూ మా కష్టాలను తీర్చారు. పింఛన్ను రూ.4వేలకు పెంచడం ఆనందంగా ఉన్నది. ఇప్పుడు ఎవరి సాయం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి లేదు. దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్తో మరింత భరోసా ఏర్పడింది.
– వడ్డేపల్లి జంగయ్య గౌడ్, నల్లచెరువు గ్రామం, మాడ్గుల మండలం
సంతోషంగా ఉంది..
నాకు రెండువందలు పింఛన్ కాంగ్రెస్ సర్కారులో ఇచ్చేవారు. అవి దేనికి సరిపోయేవికావు. నేను నడువలేని స్థితిలో ఉన్నాను. తెలంగాణ వచ్చినంక ముఖ్యమంత్రి సారు రూ.3016పింఛన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సారు రూ.4016పింఛన్ ఇస్తామని ప్రకటించటం ఎంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో నా కుటుంబం చింతలేకుండా ఉండచ్చు.
– సాలమ్మ, దివ్యాంగురాలు, ఇబ్రహీంపట్నం
సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు..
దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వాల పాలనలో దివ్యాంగులను పట్టించుకున్న పాపానపోలేదు. ప్రత్యేక రాష్ట్రంలో దివ్యాంగులకు సముచితస్థానం కల్పించి రూ.3016పింఛన్ను రూ.4016 అందించిన దైవసమానులు. ఆయనకు దివ్యాంగుల తరుఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– కాళ్ల జంగయ్య, దివ్యాంగుల సంఘం నాయకుడు (ఇబ్రహీంపట్నం)
తెలంగాణలోనేఆసరా పింఛన్లు..
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు దేశానికే దిక్సూచి. వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ-ఎయిడ్స్ ఉన్న వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. దివ్యాంగులకు ఆసరాగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత మన ప్రభుత్వానిది. మాకు పెన్షన్ లేకపోతే ఏమైపోయి ఉండేవాళ్లమో.. కుటుంబాలను పోషించేలా ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. ఈ నెల నుంచి రూ.4,016 దివ్యాంగులకు పెన్షన్ అందివ్వనుండడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– శంమ్ష్ బేగం, దివ్యాంగురాలు, యాలాల మండలం, ముద్దాయిపేట
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ రూ.4,016లకు పెంచి ఆదుకుంటున్నది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని కులాలు, తెగలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణలో పెద్దపీట వేశారు.
– జోహార్ హుస్సేన్, దివ్యాంగుడు, యాలాల మండలం, ముద్దాయిపేట
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా
దివ్యాంగుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా ఇప్పటికే ప్రతి నెల రూ.3016 ఇచ్చి ఆదుకుంటుంది. అదనంగా మరో వెయ్యి పెంచి ఈ నెల నుంచే పెరిగిన పింఛన్ అమల్లోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. పింఛన్ పెంపు పై ముఖ్యమంత్రి కేసీఆర్కు దివ్యాంగులు రుణపడి ఉంటారు.
– శ్రీనివాస్, దామరిగిద్ద గ్రామం, చేవెళ్ల మండలం, దివ్యాంగుడు