రంగారెడ్డి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 26 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో వికాస్రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో డేటా ఎంట్రీ పూర్తి చేసిన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా క్షుణ్ణంగా స్క్రూటినీ జరపాలన్నారు. జనవరి 5న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉన్నందున.. పరిశీలనా ప్రక్రియలో జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు రోజువారీ దరఖాస్తుల పరిశీలన ప్రగతిని సమీక్షించాలని సూచించారు. డూప్లికేట్ ఓట్లు లేకుండాఇంటింటికీ తిరిగి క్షుణ్ణంగా నిర్ధారణ చేసుకోవాలని ఆదేశించారు. చెక్లిస్ట్ను రూపొందించుకొని బీఎల్వోలతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించాలన్నారు. 2023లో ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా అర్హులందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వందేండ్ల వయసు పూర్తి చేసుకున్న ఓటర్ల సంఖ్య 6,149 ఉందని.. క్షేత్రస్థాయిలో ఆ వివరాలను మరోసారి సమగ్రంగా ధ్రువీకరించుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఓటర్ల ఫొటోలు సరైన విధంగా లేనట్లయితే, వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు జాబితా పారదర్శకంగా, పక్కాగా రూపొందబడేలా అన్ని స్థాయిల్లో పకడ్బందీ పరిశీలన చేయాలని.. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫారం 6, 7, 8 సంబంధిత దరఖాస్తులను పరిశీలించి డిజిటలైజ్ చేసినట్టు, పెండింగ్లో ఉన్న 835 దరఖాస్తులను వెంటనే పరిశీలించి డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, అధికారులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
ఓటరు నమోదు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవికిరణ్తో కలిసి జిల్లా కలెక్టర్లతో ఓటర్ నమోదు, సవవరణలకు సంబంధించిన ఫారం 6,7,8 ఆన్లైన్ డేటా ఎంట్రీ, ఓటర్ జాబితా రూపకల్పనపై వీడియో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్కుమార్ పాల్గొన్నారు.