మంచాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్న భక్తులతో ఎటు చూసినా ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోవడంతో బుగ్గదేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం ఒకే రోజు దాదాపు యాభైవేల మంది భక్తులకు పైగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంగా మారాయి. ఎటు చూసినా కనుచూపు మేరలో భక్తులతో నిండిపోయాయి.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా గుండంలో స్నానమాచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామి వారి సన్నిధానంలో సత్యనారాయణస్వామి వ్రతాలతో పాటు తులసికోట, శివలింగం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమీపంలో ఉన్న కబీర్ దాస్ మందిరంలోని నాగన్న పుట్ట, నర్సింహ బాబా సమాదితో పాటు కబీర్దాస్ మందిరంలో పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు కాలి నడకనే ఆలయం వద్దకు చేరుకోని స్వామి వారిని దర్శించుకున్నారు.
గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్రెడ్డి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. మంచాల సీఐ వెంకటేశ్గౌడ్, ఎస్సైలు సురేష్, రామన్గౌడ్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా వందమంది పోలీసులతో పాటు 15 సీసీ కెమెరాల నడుమ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.