కొందుర్గు : మారుమూల గ్రామాలను సైతం పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని వనంపల్లిలో రూ. 5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అలాగే దరిగూడ గ్రామంలో 66 లక్షలతో సీసీ రోడ్డు పనులు, జిల్లెడు గ్రామంలో 5లక్షలు, పద్మారం గ్రామంలో 5లక్షలు, వీరన్నపేట 5లక్షలు, పెద్ద ఎల్కిచర్ల 5లక్షలు, ముష్టిపల్లి 5లక్షలు, చేగిరెడ్డి ఘనాపూర్ 5లక్షలు, ముష్టిపల్లి 5 లక్షలు, ఎదిర 5 లక్షలు, పీర్జాపూర్ 5 లక్షలు, జాకారం 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ఇదివరకే అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రామాల్లోని కాలనీలను అందంగా తయారు చేసేందుకు సీసీరోడ్లు మంజురు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామాలను సుందరంగా మార్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బంగారు స్వరూప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, సర్పంచ్లు బాబురావు, వెంకటస్వామి, శివమౌళి, బాల్రాజు, రాణి తదితరులు పాల్గొన్నారు.