వరంగల్, అక్టోబరు 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో ఆలయాలకు కొత్త కళ వస్తున్నది. కాకతీయుల హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆలయాలు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇలాంటి ఆలయాలకు కొత్త శోభను తెస్తున్నారు. కాకతీయుల ఆరాధ్య దేవతగా ఉన్న వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి 11.70 కిలోలతో బంగారు కిరీటం, జటామకుటాలు, కర్ణాభరణాలను సమర్పించారు. ఇప్పుడు ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రక్రియ మొదలైంది. వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయంలో మాడవీధులను, తొమ్మిది అంతస్తుల రాజగోపురం, ఆలయ ఆవరణలో పూర్తిగా గార్డెనింగ్, భక్తులకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఇటీవలే నిధులు విడుదల చేసింది. మాడవీధులు, రాజగోపురం నిర్మాణల కోసం డిజైన్లు సిద్ధమయ్యాయి.
పెద్దఎత్తున ఉత్సవాలు
ఆలయంలో ఏటా అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు, నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దేవాదాయ శాఖ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కలిసి ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నాయి. భద్రకాళి ఆలయంలో రద్దీ పెరుగుతున్నది. ప్రతి శుక్రవారం ఇంకా ఎక్కువగా ఉంటున్నది. భద్రకాళి అలయం ఇరుకుగా ఉండడంతో ఉత్సవాల సమయంలో అమ్మవారిని ఊరేగించేందుకు ఇబ్బంది అవుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత చారిత్రక దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నది.
మారనున్న ఆలయ రూపురేఖలు
ఆలయం చుట్లూ మాడ వీధులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మాణం చేయడంతో ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆమ్మవారి ఉత్సవాల సమయంలో నిర్వహించే రథోత్సాలు, వాహన సేవలు మాడవీధుల్లో జరుగనున్నాయి. దేవాదాయ శాఖ దీని కోసం ప్రణాళిక రూపొందించింది. ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గోపురం నిర్మించడంతోపాటు తెప్పోత్సవానికి అనుగుణంగా కొలనును నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మాడవీధులు, గోపురం, తెప్పోత్సవానికి కొలనుతో ఆలయం కొత్తరూపు సంతరించుకోనున్నది.
తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణానికి ఏర్పాట్లు
భద్రకాజలి అమ్మవారి దేవాలయ మాడ వీధులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లను మంజూరు చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి మరో రూ.10 కోట్లను దీనికి కేటాయించారు. మొత్తం రూ.30 కోట్లతో భద్రకాళి మాడ వీధుల నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీంతోపాటు తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయం చుట్టూ రాతి బేస్మెంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రసిద్ధ ఆలయం.. భద్రకాళి
చాళుక్యులు, కాకతీయుల హయాంలో భద్రకాళి ఆలయం భద్రగిరిగా, అమ్మవారు కాళీమాతగా పూజలందుకున్నది. వేంగీ చాళుక్యులపై విజయం సాధించిన పశ్చిమ చాళుక్య రాజు రెండో పులకేశి 625వ సంవత్సరంలో భద్రకాళి ఆలయాన్ని నిర్మించి, పూజులు మొదలుపెట్టినట్లు చారిత్రకంగా నిర్ధారణ అవుతున్నది. ఆ తర్వాత కాకతీయులకు భద్రకాళి ఆరాధ్యదైవంగా ఉన్నది. ముఖ్యమైన కార్యక్రమాలను మొదలుపెట్టే ముందు కాకతీయులు భద్రకాళి ఆలయంలో పూజలు చేసేవారని శాసనాలు చెబుతున్నాయి. గణపతిదేవుడి హయాంలో హరి అనే మంత్రి ఆలయం పక్కన భద్రకాళి చెరువును తవ్వించాడు. దేశంలోనే కూర్చుని ఉన్న అతిపెద్ద భద్రకాళి విగ్రహం ఇక్కడే ఉన్నది. వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయం దేశంలోని ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. తెలంగాణలోని దుర్గామాత ఆలయాల్లో ఇది ప్రముఖమైనది. ఇక్కడి ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఎనిమిది చేతులతో ఏకశిలపై ఉన్నది.
టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం..
– దాస్యం వినయభాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్
చారిత్రక నగరం వరంగల్ను రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తున్నది. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం రూ.30కోట్లు మంజూరు చేసింది. వీటితో భద్రకాళి ఆలయం సమగ్ర అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరంలో అనేక చారిత్రక దేవాలయాలు, జైన మతానికి చెందిన అగ్గలయ్య గుట్ట వంటి అనేక పర్యాటక ప్రాంతాలు వరంగల్ నగరంలో ఉన్నాయి. చారిత్రక ప్రాంతాలు, సహజ సిద్ధ అందాలను అనుసంధానం చేసి వరంగల్ నగరాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక అమలవుతున్నది.