పెద్దేముల్, జనవరి 12 : అటవీ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో తప్పకుండా నాణ్యణా ప్రమాణాలను పాటించాలని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో ఆత్కూర్ అటవీ ప్రాంతంలో వేసిన రోడ్డును, తట్టేపల్లి బీట్ ఆఫీసర్ క్వార్టర్ను, నాగులపల్లి రిజర్వ్ ఫారెస్ట్ నిర్మించిన రాతికట్టలను, ఫైర్ లైన్ క్రియేషన్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు-తొర్మామిడి ప్రధాన రోడ్డు మార్గంలో ఆత్కూర్ అటవీశాఖ పరిధిలో ఆత్కూర్ శివాలయం నుంచి సిద్ధన్నమదుగుతండా వరకు ఆర్అండబీ అధికారులు వేసిన రోడ్డును పరిశీలించినట్లు తెలిపారు. గతంలో అటవీశాఖ పరిధిలో ఈ రోడ్డుమార్గంలో 10 ఎకరాల అటవీ భూమి పోయిందని.. దానికి బదులు వేరే చోట 10 ఎకరాల భూమిని చూపిస్తామని పెట్టిన ప్రతిపాదనలు వెనక్కి వచ్చినట్లు తెలిపారు.
ప్రతిపాదనలు వెనక్కి రావడంతో రోడ్డును పరిశీలిస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు. నాగులపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో రాతికట్టల నిర్మాణాలు, అటవీ ప్రాంతం ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి కాకుండా ఉండేందుకు నూతనంగా నిర్మిస్తున్న ఫైర్లైన్ క్రియేషన్ను పరిశీలించి అటవీశాఖ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో కచ్చితత్వం ఉండాలని, తూచా తప్పకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.
అటవీశాఖ పరిధిలో వచ్చే సంవత్సరంలో నాటడానికి పెంచే మొక్కలను నాగులపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో పెంచడానికి అనువైన స్థలాన్ని సిబ్బందితో కలిసి పరిశీలించారు. అంతకుముందు తట్టేపల్లి బీట్ ఆఫీసర్ క్వార్టర్ను కూడా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీల సమయంలో ఆయన వెంట తాండూరు ఎఫ్ఆర్వో శ్యాంసుందర్రావు, ఎఫ్ఎస్వో భాగ్యమ్మ ఉన్నారు.