షాబాద్, ఏప్రిల్ 20 : ఉన్నత విద్యాభ్యాసం చేసిన దంపతులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్లపై నిలబడి పదిమందికి ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగారు. వ్యవసాయంపై ప్రేమ, మక్కువ ఉండడంతో తమ సొంత పొలంలోనే పూల సాగుతోపాటు పూల మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. అక్కడ పెంచిన నారుకు మంచి డిమాండ్ ఉండటంతో మార్కెట్ ధర కంటే తక్కువకే రైతులకు విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఒకరి చేతి కింద పనిచేయడం ఇష్టంలేని ఈ దంపతులు దాదాపుగా 20 మందికి ఉపాధిని కల్పిస్తూ ప్రతినె లా రూ.లక్ష వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.
మండలంలోని సర్దార్నగర్ గ్రామానికి చెందిన దాదె అమృత్రాజు, స్వప్న దంపతులు. రాజు బీఈడీ, బీఏ పూర్తి చేయగా.. స్వప్న ఎంఏ చదివిం ది. వీరికి 2000లో వివాహం జరుగగా ముగ్గురు పిల్లలున్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఈ భార్యాభర్తలు ఒకరి చేతి కింద పనిచేయడం ఇష్టం లేక ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడలేదు. స్వయం ఉపాధితో ముందుకు సాగి పది మందికి ఉపాధి కల్పించాలనుకున్నారు. వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఎనిమిదేండ్ల క్రితం గ్రామంలోని తమ పొలం రెండెకరాల్లో రూ.15 లక్షలతో పూల మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. అందులో గులాబీ, చామంతి నారును పెంచుతున్నారు. మార్కెట్లో గులాబీ నారును రూ.20 వరకు విక్రయిస్తుండగా వీరు మాత్రం రూ.12-15 వరకు అందిస్తున్నారు. చామంతి నారునూ రూ. 1.50 పైసల నుంచి రూ.2 వరకు విక్రయిస్తున్నా రు. ఇక్కడ పెంచే నారు నాణ్యతగా, ఆరోగ్యంగా ఉంటుందని రైతుల నమ్మకం. దీంతో అత్యధికంగా ఇక్కడికి వచ్చి నారును తీసుకెళ్తుంటారు. మరో మూడు ఎకరాల్లో పూలను సాగు చేస్తున్నారు.
ఆ దంపతులు తమ పొలంలో పెంచే నారు ఆరోగ్యంగా ఉంటుండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. రైతులు ఫోన్ల ద్వారా బుక్ చేసుకుని తీసుకెళ్తుంటారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులు ఇక్కడికొచ్చి తీసుకుపోతుంటారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, కడప ప్రాంతాలకు కూడా నారును సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు. ఇతర ప్రాంతా ల నుంచి తీసుకొచ్చే నారుకంటే ఈ నారుతో మం చి దిగుబడులు వస్తాయని రైతుల నమ్మకం. దీం తోపాటు మరో మూడు ఎకరాల్లో పూల సాగుతోపాటు పందిరి విధానంలో కూరగాయలను సా గు చేస్తున్నారు. తమిళనాడు, కృష్ణగిరి నుంచి గులాబీ నారు విత్తనాలు (సెంట్బుల్లెట్, కస్టార్, ఎల్లో, ఆరెంజ్ రకాలను) తీసుకొచ్చి తమ నర్సరీలో పెం చుతున్నారు. ఈ నారు విత్తనాలు తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి.
పూల మొక్కల నర్సరీ, పూల సాగు ద్వారా ప్రతిరోజూ 20 మంది వరకు ఉపాధి కల్పిస్తున్నారు అమృత్రాజు, స్వప్న దంపతులు. వారితోపాటు గ్రామానికి చెందిన మరో 20 మంది ప్రతిరోజూ నర్సరీలో పనులు చేస్తున్నారు. ట్రేలలో ఎరువులు నింపడం, విత్తనాలు వేయడం, నారు మొక్కలు పెట్టడం, రైతులకు నారు తీసి విక్రయించడం వం టి పనులు చేస్తుంటారు. కూలీలకు రోజుకు రూ. 300 వరకు చెల్లిస్తున్నారు.
నర్సరీలో పెంచిన నారును విక్రయించడం ద్వారా మంచి ఆదాయం వస్తున్నది. మేము నర్సరీలో గులాబీ, చామంతి నారును పెంచుతున్నాం. బయట మార్కెట్లో గులాబీ నారును రూ.20 వరకు విక్రయిస్తుండగా ఇక్కడ మాత్రం రూ.12-15 వరకు అమ్ముతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని పలు జిల్లాలకు నారును సరఫరా చేస్తున్నాం. నేను, నా భార్యతోపాటు మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నా. దీంతో నెలకు రూ. లక్ష వరకు ఆదాయం వస్తున్నది.
-దాదె అమృత్రాజు, నర్సరీ నిర్వాహకుడు, సర్దార్నగర్
నేను, నా భర్త ఎంఏ.. బీఏ పూర్తి చేశాం. ఉన్నత విద్యాభ్యాసం చేసినా ఎప్పుడూ ప్ర భుత్వ ఉద్యోగాల కోసం ఎదు రు చూడలేదు. ఒకరి చేతి కింద పనిచేయడం ఇష్టం లేకనే మా పొలంలోనే పూల సాగుతోపా టు పూల మొక్కల నర్సరీని ఏర్పాటు చేశాం. అన్ని ఖర్చులు పోను నెలకు ఆదాయం బాగానే వస్తున్నది. ముగ్గురు పిల్లలను బాగా చదివిస్తున్నాం.
-స్వప్న, నర్సరీ నిర్వాహకురాలు