ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం తొలిరోజు సందడిగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అబ్దుల్లాపూర్మెట్లో నిర్వ హించిన ‘ప్రజాపాలన’ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన గ్రామ సభలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లాలో గురువారం 98 గ్రామ పంచాయతీలు, 16 మున్సిపాలిటీల పరిధిలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంద మందికి ఒక కౌంటర్ చొప్పున మొత్తం 713 కౌంటర్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరించారు. అదే విధంగా వికారాబాద్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున దరఖాస్తులు అందాయి. కాగా అధికారులు తీసుకొచ్చిన దరఖాస్తు ఫారాలు ఏ మూలకూ చాలకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే అదునుగా భావించిన జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు అందినకాడికి దండుకున్నారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ)
ఇబ్రహీంపట్నం/ పెద్దఅంబర్పేట, డిసెంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో జిల్లా ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్లో గురువారం ఆరు గ్యారెంటీల అమలులో భాగం గా ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మాది ప్రజల ప్రభుత్వమని.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించటమే లక్ష్యమన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతోనే ఆరు గ్యారెంటీ పథకాలను అందరికీ అందిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలతోపాటు ప్రజలకు ఉపయోగపడే పెండింగ్ పనులపైనా నివేదికలను రెఢీ చేయాలని అధికారులకు సూచించారు. త్వరలోనే అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలందరికీ అందించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులతోపాటు పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకునేందుకు నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడంతోపాటు పేదలకు నాణ్యమైన వైద్యం అందాలన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.పది లక్షల ఆర్థిక సహాయాన్ని, పేద, మధ్యతరగతి ప్రజలకు అందిస్తున్నామన్నారు.
తాను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్మార్చ్ పేరిట పాదయాత్ర చేసిన సమయంలో.. అబ్దుల్లాపూర్మెట్ మండలంలో జరిగిన పాద యాత్రలో అనేకమంది ఇల్లులేని పేద మహిళలు నన్ను కలువ గా.. అధికారంలోకి రాగానే ఇండ్ల నిర్మాణానికి డబ్బులు ఇస్తా మని మాటిచ్చానని.. దాని ప్రకారంగా ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా ముందుకొచ్చి ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలకు ప్రజలు దరఖాస్తులు చేసుకుని రసీదులను పొం దాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హన్మంతరావు, ప్రత్యేకాధికారిణి శృతి, రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్బాబు, జడ్పీ సీఈవో ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాశా ఖ అధికారి సుశీందర్రావు, ఆర్డీవో అనంతరెడ్డి, ఎంపీపీ రేఖ, జడ్పీటీసీ దాసు, సర్పంచ్ కిరణ్ పాల్గొన్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జిల్లా లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైనది. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా.. మొదటి రోజు 98 గ్రామ పంచాయతీలు, 16 మున్సిపాలిటీల పరిధిలోని మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామ సభలు జరిగా యి. వందమందికి ఒక కౌంటర్ చొప్పున మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా గ్రామపంచాయతీల్లో 713 కౌంటర్లను ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో మొత్తం 72,740 కుటుంబాలుండగా.. తొలిరో జు ప్రజల నుంచి 16,042 దరఖాస్తులొచ్చాయి. స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాలను ప్రత్యేకంగా రిజిస్టర్లలో నమోదు చేసి దరఖాస్తుదారులకు రసీదులను అందజేశా రు. ఉదయం 8.00 గంటలకే ప్రజాపాలన సభలతో పల్లె లు, వార్డుల్లో సందడి నెలకొన్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, భోజన విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లలో గ్రామసభలను నిర్వహించారు. సభల ఆరంభంలో అధికారులు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్ర భుత్వం జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్మెట్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం పట్టణం, ఆరుట్ల, గునగల్లో జరిగిన ప్రజాపాలన సభల్లో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల, ఆలూరు, చందనవెల్లిలలో జరిగిన కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని ఎలికట్ట, లేమామిడి, కొందుర్గు, కొత్తూరు, చౌదరిగూడెంలలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
జిల్లాలో గురువారం పలు చోట్ల జరిగిన ప్రజా పాలన నిర్వహణ తీరును రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సెక్రటరీ మాట్లాడుతూ అభయహస్తం 6 గ్యారెంటీల కోసం కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలన్నారు. గ్రామాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలన్నారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గడపకూ వెళ్లి దరఖాస్తు ఫారాలను అందజేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన లేదని, ఆధార్కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చునన్నారు. వదంతులను నమ్మి ఆందోళన చెందొద్దన్నారు. పంచాయతీరాజ్శాఖ కమిషనర్ హన్మంత్రావు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్పెషల్ ఆఫీసర్ శృతి దరఖాస్తుల స్వీకరణ తీరును పర్యవేక్షించారు.
అవసరమైన మేరకు జిల్లాలకు దరఖాస్తులను చేరవేసినట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ చాలాచోట్ల దరఖాస్తుల కొరత ఏర్పడింది. మొయినాబాద్ మండలంలోని సురంగల్లో దరఖాస్తుల కొరతతో కొద్దిసేపు ప్రజలు ఆందోళన చెందా రు. షాద్నగర్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. వెల్జర్ల, ఎలికట్ట తదితర చోట్ల జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు రూ.150-రూ.200 వరకు కలర్ జిరాక్స్ దరఖాస్తులను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇదిలా ఉండగా..ఒక కుటుంబం ఒకే దరఖాస్తు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధన ప్రజలను అయోమయానికి గురిచేసింది.
తల్లిదండ్రుల నుంచి పిల్లలు, అన్నదమ్ము లు వేర్వేరుగా ఉంటున్నా..చాలావరకు వారందరికీ ఒకే రేషన్ కార్డు ఉంది. ఇలా.. అనేక కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. రేషన్ కార్డుపై ఒకే దరఖాస్తుకు అవకాశం ఉండడంతో కుటుంబంలోని మిగతా సభ్యులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తున్నది. దీనిపై అధికారుల నుంచి సైతం స్పష్టత లేకపోవడంతో చాలామంది అధికారులను ఈ విషయమై వాకబు చేయడం కనిపించింది. దరఖాస్తులను అక్కడే పూరించలేని నిరక్షరాస్యులు దరఖాస్తులను మరుసటి రోజు సమర్పిస్తామని చెప్పి ఇండ్లకు తీసుకెళ్లారు. కాగా మున్సిపాలిటీల నుంచి 33,068 దరఖాస్తులు వచ్చాయి.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో గురువారం ప్రారంభమైనది. సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. జిల్లాలో అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. కుటుంబం నుంచి ఒకరు వచ్చి దరఖాస్తు ఇస్త్తే సరిపోతుందన్నారు.