మొయినాబాద్, మార్చి 29 : చెరువుల్లో రోజు రోజుకూ నీటి మట్టం తగ్గుతూ జలకళను కోల్పోతున్నాయి. గతంలో ఎండాకాలంలో సైతం నీటితో కళకళలాడిన చెరువులు మార్చి చివరి వరకు చెరువుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. చెరువుల్లో నీటి మట్టం తగ్గుతున్న కొద్దీ చెరువుల కింద ఉన్న బోరుబావుల్లో సైతం భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి.
గత ప్రభుత్వం చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు పునరుద్ధరించింది. వర్షాలు కూడా సమృద్ధిగా కురవడంతో పల్లె చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు మార్చి చివరినాటికే ఎండుముఖం పట్టాయి. ఏప్రిల్ రెండవ వారం వరకు చెరువుల్లో చుక్క నీరు కూడా కనిపించని పరిస్థితి నెలకొననున్నది. దీంతో చెరువుల కింద వ్యవసాయ బోరులు సైతం ఎండిపోయే ప్రమాదం కూడా ఉంది.
మండలంలో సురంగల్, చిలుకూరు, నక్కలపల్లి, హిమాయత్నగర్, చిన్నమంగళారం గ్రామాల్లోని చెరువుల్లో గతంలో మత్స్యకారులు చేప పిల్లలను వదిలి ఉపాధి పొందారు. సురంగల్ పెద్ద చెరువులో మత్స్యకారులు చేప పిల్లలను గత మూడు ఏండ్ల నుంచి వదిలి చేపలను పెంచుకుని ఉపాధి పొందారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలతో పాటు మత్స్యకారులు సొంతంగా మరికొన్ని చేప పిల్లలను తీసుకొచ్చి చెరువులో వదిలి పెంచుకుని ఆదాయం పొందారు. కానీ ఇప్పుడు చెరువులు ఎండు ముఖం పట్టడంతో జీవనోపాధి కోల్పోతామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా హిమాయత్నగర్, నక్కలపల్లి, చిలుకూరు చెరువుల్లో మత్స్యకారులు చేపలను పెంచి ఉపాధి పొందారు.