కేంద్రం వందశాతం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని.. పంజాబ్లో ధాన్యం కొంటూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్ర సర్కార్పై పోరుకు సన్నద్ధం కావాలని మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మహేశ్వరంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొనగా, ఇబ్రహీంపట్నంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆందోళనల సెగ ఢిల్లీని తాకేలా నిరసనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పంజాబ్లో రెండు పంటలకు సంబంధించిన వడ్లు కొంటున్న కేంద్రం.. తెలంగాణలో ఎందుకు కొనదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మన రైతులపై కేంద్రం అవలంబిస్తున్న పక్షపాత ధోరణిని ప్రజల్లోకి తీసుకెళ్లి నిరసనల్లో భాగస్వాములను చేయాలన్నారు. కేంద్రం ధాన్యం కొనాలని నేటి నుంచి గ్రామపంచాయతీ, మండల, నియోజకవర్గ, అన్ని స్థానిక సంస్థల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. అప్పటికీ కేంద్రం దిగిరాకుంటే ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసి ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని సూచించారు.
రైతులు పండించిన వరి ధాన్యాన్ని వంద శాతం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలం బిస్తున్నదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొనగా, ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్రెడ్డి, చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాద్నగర్లో అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్క రూ ముందుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూనే సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కేంద్రం కొనాలని నేటి నుంచి గ్రామ పంచాయతీలు మొదలుకొని జిల్లా పరిషత్ల వరకు తీర్మానాలు చేయాలన్నారు. నేడు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో తీర్మానాలు, ఈనెల 26న మండల పరిషత్ల తీర్మానాలు, ఈనెల 27న జిల్లా రైతుబంధు కమిటీలతోపాటు మండల రైతుబంధు సమితిల ఆధ్వర్యంలో, ఈనెల 28న మార్కెట్ కమిటీలు, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో, ఈనెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ల ఆధ్వర్యం లో, ఈ నెల 30న అన్ని మున్సిపాలిటీల పాలకవర్గాలు, జడ్పీలు కేంద్రం వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తీర్మానాలు చేయనున్నారు.
-రంగారెడ్డి, మార్చి 24, (నమస్తే తెలంగాణ)