రంగారెడ్డి, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో భూములకు డిమాండ్ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. చివరకు గుట్టలను సైతం వదలడం లేదు. ఫలితంగా జిల్లాలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలో కరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ శశాంక ప్రభుత్వ భూములపై ప్రత్యేక నజర్ పెట్టారు. వాటి పరిరక్షణ దిశగా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ భూముల లెక్కలను తేల్చాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 7 మండలాల్లోని 604 రెవెన్యూ గ్రామాల వారీగా లెక్కలు తీసే పనిలో తహసీల్దార్లు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు కబ్జా అయిన భూములతోపాటు అన్ని రకాల ఖాళీ ప్రదేశాలను గుర్తిస్తున్నారు.
ప్రభుత్వ భూముల గుర్తింపు కోసం తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, సర్వేయర్లు మండలాల వారీగా సమావేశమై యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారు. రెవెన్యూ గ్రామాల వారీగా ఈ ప్రక్రియ నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రికార్డుల ప్రకారం కేటగిరీలవారీగా ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నారు. ప్రభుత్వ, పొరంబోకు, బంచరాయి, శిఖం, సీలింగ్, భూదాన్, ఆలయ ఇతరత్రా భూములన్నింటినీ క్షుణ్ణంగా రికార్డుల్లో పరిశీలిస్తున్నారు. ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది? ఎంత మేర ఆక్రమణకు గురైంది? ఇంకా ఎంత ప్రభుత్వ భూమి మిగిలి ఉంది? అన్న అంశాలను ఓ ఫార్మాట్లో నమోదు చేస్తున్నారు. వివరాలు సమగ్రంగా ఉండేలా తహసీల్దార్లు, ఆర్డీవోలు ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ జిల్లాలో యాభై శాతానికి పైగా పూర్తయినట్లు తెలిసింది.
ఇకపై ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టే దిశగా అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న కబ్జాదారులపై కలెక్టర్ శశాంక ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ నిర్మాణాల కూల్చివేత వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే రీతిన కఠినంగా ఉండాలని తహసీల్దార్లకు కలెక్టర్ సూచిస్తున్నారు. ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక వాటిని నిషేధిత జాబితాలో పెట్టి అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టనున్నట్లు తెలుస్తున్నది. అలాగే జియోట్యాగింగ్తో హద్దులను ఖరారు చేసే దిశగా పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.
దీనివల్ల భూములను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు కార్యాలయాల నుంచి కంప్యూటర్ ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుంది. తద్వారా భూ ఆక్రమణకు అడ్డుకట్టపడే అవకాశముంటుంది. ప్రభుత్వ భూములు ఉన్న చోట ప్రస్తుతానికి బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. విలువైన భూముల చుట్టూ భవిష్యత్తులో పెన్సింగ్ సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారయంత్రాంగం ఉన్నది. అలాగే లెక్కతేలిన ప్రభుత్వ భూములను ప్రజల అవసరాలకు వినియోగించే ప్రతిపాదనను సైతం జిల్లా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.