రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరూరా రైతు సంబురాలు అంబరాన్నంటాయి. డప్పుల దరువులు, రైతుల నృత్యాలు మధ్య పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించారు. రైతు వేదికల్లో జిల్లా, మండల స్థాయి అధికారులు అన్నదాతలతో సమావేశం నిర్వహించి రైతు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతోపాటు పంట సాగులో ఉన్న అపోహలను నివృత్తి చేశారు. స్వరాష్ర్టానికి ముందు, తరువాత పంటల సాగుకు సంబంధించిన ఫొటోలను ప్రదర్శించి వ్యవసాయంలో సాధించిన ప్రగతిని రైతులకు వివరించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల రైతు దినోత్సవం జరుగగా.. మహేశ్వరం, కొడంగల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
రంగారెడ్డి, జూన్ 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జిల్లాలో జనరంజకంగా కొనసాగుతున్నాయి. డప్పుల దరువులు, యువ రైతుల నృత్యాలు, ఆటాపాటలు జోరుగా సాగాయి. రైతు వేదికల్లో జిల్లా, మండల స్థాయి అధికారులు రైతులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి వారి ఇబ్బందులు, రైతు బంధు, బీమా, సబ్సిడీపై వాహనాలు, విత్తనాలు, ఎరువులపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేశారు. రైతన్నలకు పంటలు, సాగు వివరాలపై శిక్షణ మొదలైన వాటి గురించి సందేహాలను తొలగించారు.
జిల్లాలోని 83 రైతు వేదికలు రైతు దినోత్సవానికి అద్భుతంగా ముస్తాబయ్యాయి. పలు రైతు వేదికల్లో రైతు దినోత్సవంపై ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. గత కాలంలో వ్యవసాయ సాగు, ప్రస్తుత సాగు గల తేడాలను చిత్రాల ద్వారా పలుచోట్ల ఆవిష్కరించారు. కళాకారులు పలు రైతు వేదికలపై కష్ట, నష్టాలు, రైతులు పడుతున్న గోసలను తెల్పుతూ, అదే విధంగా సీఎం కేసీఆర్ రైతుల ఇబ్బందులను తీర్చిన విధానంపై గానా బజానా నిర్వహించారు. కళాకారులు ఒగ్గుడోలు, గుస్సాడి, థింసా వాయిద్యాలను ప్రధానంగా వాడారు. జానపద, బంజారా, గోండు నృత్యాలు పలువురినీ ఆకట్టుకున్నాయి. పలు కూడళ్లలో రైతులు గుమికూడి మరణించిన రైతులకు నివాళులర్పించారు. రైతన్నలు పడుతున్న కష్టాలపై సీఎం కేసీఆర్ అందించిన భరోసాపై పలువురు యువ రైతులు చర్చించారు.
ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కార్లు, పలు వాహనాల్లో రైతులు ఆకు పచ్చని రంగులో తలపాగాలు ధరించి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా కదిలి ర్యాలీలు నిర్వహించారు. జై కిసాన్, జై కేసీఆర్ అంటూ వీధి వీధినా నినదించారు. పలు గ్రామాల్లో దారులన్నీ రంగు రంగుల బండ్లు, వాహనాలతో నిండిపోయాయి.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, అబ్దుల్లాపూర్మెట్లోని పలు రైతు వేదికల్లో మంత్రి సబితారెడ్డి పాల్గొని రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషిని గురించి తెలియజేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి, చేవెళ్ల మండల పరిధిలోని పలు రైతు వేదికలపై జరిగిన సంబురాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ, చించోడు, కొండన్న గూడలలో జరిగిన రైతు సంబురాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ రాజేంద్రనగర్, శంషాబాద్ మండలంలో మల్కారం వద్ద జరిగిన రైతు వేదికల వద్ద పాల్గొన్నారు. ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి కడ్తాల్ మండలం, తలకొండపల్లి మండలంలోని పలు రైతు వేదికల వద్ద పాల్గొని రైతులతో ముచ్చటించారు.