చేవెళ్ల రూరల్, మార్చి 1 : అంధత్వ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి తల్లారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమంలో భాగంగా బుధవారం కంటి వెలుగు శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కంటి సమస్యలు ఉన్న వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తల్లారం సర్పంచ్ గూడెం సురేందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, వైద్య అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి అబ్దుల్ అతీక్ అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించి మందులు, కళ్ల అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
మంచాల : మంచాల మండలం బండలేమూరు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ మంగ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంతోష, పంచాయతీ కార్యదర్శి సువర్ణ, వార్డు సభ్యుడు బీ రమేష్, గ్రామస్తులు చంద్రయ్య, ఐలయ్య, శ్రీనివాస్, సత్తయ్య, పోచమ్మ పాల్గొన్నారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. పెద్దఅంబర్పేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. వారికి పరీక్షలు చేసి.. అవసరమైన వారికి కండ్లద్దాలు పంపిణీ చేశారు.