దళితుల తలరాత మార్చే దళితబంధు అమలుకు అధికారులు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడుతలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున వికారాబాద్ జిల్లాకు 358 యూనిట్ల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులకు ఆ యూనిట్లను అందజేయగా, మిగిలిన యూనిట్లను ఈనెల 25లోపు గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పరిగి, సెప్టెంబర్ 13: ఏకంగా రూ.10 లక్షలను గ్రాంటుగా అం దజేసే మహత్తర పథకం దళితబంధు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి దళితులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమ లు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్లు చొప్పున 358 యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.35.80 కోట్లను విడుదల చేసింది. ఒక్కో లబ్ధ్దిదారు బ్యాంకు ఖాతాలో 9,90,000 చొప్పున జమ చేసింది. మిగతా డబ్బులు రక్షణ నిధిలో జమయ్యాయి. ఇప్పటికే పలు యూనిట్ల్ల గ్రౌండింగ్ పూర్తి కాగా మిగిలిన వాటిని ఈనెల 25వ తేదీ లోపు గ్రౌండింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
92 యూనిట్ల గ్రౌండింగ్ కోసం..
వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో 358 యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులకు డబ్బులు మంజూరయ్యాయి. లబ్ధ్దిదారుల ఇష్టానుసారమే వివిధ రకాల యూనిట్లను మంజూరు చేస్తున్న అధికారులు ఇప్పటికే వాహనాలు, ఇతర వ్యాపారాల ప్రారంభానికి సంబంధించి యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. కాగా మిగిలిన 92 రకాల యూనిట్ల గ్రౌండింగ్ త్వరగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఈనెల 20వ తేదీలోపు అన్ని యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో డెయిరీకి సంబంధించి 46 యూనిట్లు, పౌల్ట్రీకి సంబంధించి 19యూని ట్లు, గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించి 25 యూనిట్లు, ఎడ్లు, బండి 2 యూనిట్లు ఏర్పాటు కావాల్సి ఉన్నది. పాడి పశువుల పెంపకం, గొర్రెలు, మేకలు, పౌల్ట్రీకి సంబంధించి షెడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నిర్మాణ పనులు కొంత మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ వరకు వాటి నిర్మాణాలను పూర్తి చేయించి యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. షెడ్ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు. తద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేయించేందుకు కృషి జరుగుతున్నది. మలి విడుత యూనిట్ల పంపిణీకి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి పశువులు, మేకలు, గొర్రెలు..
లబ్ధ్దిదారులు ఏర్పాటు చేస్తున్న షెడ్ల నిర్మాణ పనులు పూర్తి కాగానే ఇతర రాష్ర్టాల నుంచి పాడి పశువులు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేసి తీసుకురానున్నా రు. ఇందుకోసం జిల్లాలోని అధికారులు లబ్ధిదారులతో కలిసి హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ర్టాలకు వెళ్లనున్నారు. మరోవైపు కొన్ని రాష్ర్టాల్లో పశువులకు లంపీ చర్మవ్యాధి సోకుతుండటంతో పాడి పశువుల కొనుగోలులో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మేలు రకం పాడి పశువుల పెంపకంతో అధిక పాల ఉత్పత్తి జరిగి పాడి పరిశ్రమ మరింత అభివృద్ధి చెందనున్నది. అలాగే గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించిన షెడ్లు సైతం పూర్తి చేయించి త్వరగా యూనిట్లను అధికారులు గ్రౌండింగ్ చేయనున్నారు. యూనిట్ల గ్రౌండింగ్ తర్వాత లబ్ధ్దిదారులు ఎలా ఆదాయం పొందుతున్నారు.. యూనిట్లు ఎలా పనిచేస్తున్నాయి తదితర వాటిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు అవసరమైన సూచనలు, సలహాలను లబ్ధిదారులకు అందించనున్నారు. తద్వారా దళితబంధు కింద లబ్ధి పొందిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు.