‘వికారాబాద్ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు.. బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ను గెలిపిస్తే ఒకే విడుతలో నియోజకవర్గంలోని దళిత కుటుంబాలకు దళితబంధును మంజూరు చేస్తాం..’ అని గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ హామీనివ్వడంపై సెగ్మెంట్లోని దళిత కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయి. అట్టడుగున ఉండే దళితుల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ మేరకు గ్రామగ్రామాన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెబుతున్నారు. కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయంతో వికారాబాద్ నియోజకవర్గంలో 20,775 కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
-వికారాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)
‘వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక్కడ దళిత బిడ్డలు ఎక్కువగా ఉన్నారని నాకు తెలుసు, హుజూరాబాద్ మొత్తం నియోజకవర్గానికి దళిత బంధు పెట్టినం. అక్కడ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు దళితవాడలాగా లేదు, దొరల వాడలాగా తయారైంది. బిజినెస్లు పెట్టి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఎవడో ఎల్లయ్యగాడు గెలిస్తే వచ్చేది ఏం లేదని, ఆనంద్ గెలిస్తే ఒకే విడుతలో నియోజకవర్గంలోని కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తామని, దళిత కుటుంబాలు బంగారు కుటుంబాలు అవుతాయి’ అని గురువారం వికారాబాద్ నియోజకవర్గ ప్రజాశీర్వాద సభ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో వికారాబాద్ నియోజకవర్గమంతటా దళిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)
సమాజంలో అట్టడుగున ఉండే దళితుల బాగోగుల గురించి ఆలోచించే ఒకే ఒక్కరు సీఎం కేసీఆర్ అంటూ దళిత కుటుంబాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు, మర్పల్లి, వికారాబాద్, బంట్వారం, కోట్పల్లి, మోమిన్పేట్ మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు నిర్వహించారు. ఒకే విడుతలో వికారాబాద్ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు యూనిట్లు మంజూరు చేస్తామన్న సీఎం హామీతో నియోజకవర్గమంతటా దళితులు బీఆర్ఎస్ పార్టీకి చెయ్యెత్తి జైకొడుతున్నారు.
ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళిత బంధు కింద వారు కోరుకున్న వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడంతో సంబంధిత కుటుంబాలన్నీ ఆర్థికంగా సుస్థిరంగా కావడంతోపాటు ఆయా వ్యాపారాలతో కొంతమందికి జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి డాక్టర్ మెతుకు ఆనంద్ గెలవడం, బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలందరికీ ఒకే విడుతలో దళిత బంధు పథకం కింద వారికి నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం చేయనుంది. దీంతో వికారాబాద్ నియోజకవర్గంలోని 20,775 దళిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
మొదటి విడుతలో వికారాబాద్ నియోజకవర్గంలో 100 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం కింద వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను మంజూరు చేయడంతో సంబంధిత దళిత కుటుంబాల్లో వెలుగులు నిండాయి. గతంలో కూలీ పని చేసి జీవనోపాధి పొందినవారు.. దళిత బంధు పథకంలో భాగంగా ఆర్థిక సహాయం అందజేయడంతో రూ.10 లక్షల విలువ చేసే యూనిట్లు సొంతం కావడంతోపాటు దండిగా ఉపాధి పొందుతున్నారు. దళిత బంధు పథకంతో గతంలో కారు డ్రైవర్లుగా పనిచేసినవారు.. నేడు ఓనర్లు, గతంలో రోజువారీ కూలీలు.. నేడు యజమానులయ్యారు.
జిల్లాలో లబ్ధిదారులు మినీ డెయిరీ, పౌల్ట్రీఫామ్లతోపాటు కార్లు, ట్రాక్టర్ యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు సంబంధించి ఆయా రంగాల్లోని నిపుణులతో ప్రత్యేక అవగాహన కల్పించడంతోపాటు శిక్షణ కూడా ఇప్పించారు. దీంతో వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థికంగా బలోపేతమై, మరింత మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
దళిత బంధుతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. మూడు పూటల కడుపు నిండా భోజనం చేస్తూ జీవిస్తున్నాం. గతంలో మేము(భార్యాభర్తలం) రోజు కూలీ చేస్తూ మా ఇద్దరు పిల్లలను పోషిస్తుంటిమి. మాకు వ్యవసాయం చేసుకునేందుకు గుంట భూమి కూడా లేదు. నేను ప్రతిరోజూ అడ్డామీది కూలీపనికి వెళ్లేవాడిని. రోజూ పనిచేస్తేగాని జేబులో డబ్బులుండేవికావు. కనీసం హోటల్లో చాయి తాగడానికి కూడా డబ్బులుండేవి కాదు. దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలు ఇచ్చారు. దీంతో నేను ట్రాక్టర్ కొన్నాను. ప్రస్తుతం ట్రాక్టర్తో ప్రతి రోజూ రూ.2-3 వేలు, సీజన్లో రూ.5-6 వేల వరకు వస్తుంది. ప్రస్తుతం దళిత బంధు పథకంతో మా ఇంటిల్లిపాది ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నాం. నియోజకవర్గంలోని దళిత కుటుంబాలందరికీ దళిత బంధు ఇస్తామని సీఎం హామీ ఇవ్వడం చాలా సంతోషం.
– బేగరి రాజు, కెరెళ్లి, ధారూరు మండలం
దేశంలో ఏ ముఖ్యమంత్రీ అమలు చేయని పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. వికారాబాద్లో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు వరం ప్రకటించారు. సమాజంలో దళితులకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని.. దారిద్య్రాన్ని పారదోలేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉంది. కారు గుర్తుకే నా ఓటు. ఎమ్మెల్యేగా ఆనంద్ను గెలిపిస్తాం.
– చంద్రశేఖర్, మర్పల్లి మండలం
గత ప్రభుత్వాలు దళితులను అణగారిన వర్గాలుగానే గుర్తించేవారు. కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ దళితుల దీన పరిస్థితులను చూసి వారు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో వెలుగులు నింపి దళిత బాంధవుడయ్యాడు. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా అర్హత కలిగిన వ్యక్తి ఖాతాల్లో రూ.10 లక్షలు జమచేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో అర్హత కలిగిన వారందరికీ ఒకే విడుతలో దళితబంధు ఇవ్వనున్నట్లు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది.
– పెద్ద ఎల్లప్ప, అంతారం, ధారూరు మండలం
మర్పల్లి : దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సర్పంచ్ ఇందిరా అశోక్ అన్నారు. దళిత కుటుంబాలందరికీ ఒకేసారి దళిత బంధు మంజూరు చేస్తామని వికారాబాద్లో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో శుక్రవారం పట్లూర్లో సర్పంచ్ ఇందిరా అశోక్, రొంపల్లిలో ఎంపీటీసీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, కోట్మర్పల్లిలో సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య దళిత నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్, గ్రామాధ్యక్షుడు అశోక్, మాజీ ఎంపీటీసీలు రవి, అంజయ్య, నాయకులు మోహన్, లాజర్, సునీల్ ఉన్నారు.