వికారాబాద్, ఆగస్టు 7 : గృహలక్ష్మి పథకం కింద జిల్లాలో ప్రతి తహసీల్దార్, మున్సిపల్, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ ఉన్నతాధికారులతో కలిసి గృహలక్ష్మి, తెలంగాణ హరిత హారం, ఇంటి పట్టాల పంపిణీ, జీవో 59, నోటరీ భూముల క్రమబద్ధీకరణ, బీసీ మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ, దళిత బంధు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 10 వరకు ప్రజల నుంచి ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రచారం నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. రెండో దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేయాలని తెలిపారు.
జిల్లాలో 100 గొర్రెల యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గొర్రెల కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పన తదితర అంశాలు పకడ్బందీగా జరగాలన్నారు. జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధులచే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని, సదరు సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని తెలిపారు. బీసీ కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 300 చొప్పున ఎంపిక చేయాలని, ఎమ్మెల్యేలతో చర్చించి వారి సమయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు వివరాలు తెలియజేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటి దశ బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ఆగస్టు 10లోపు పూర్తి కావాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ శాఖ కింద జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారుల ఎంపిక త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. వీడియో సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కృష్ణన్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సుధారాణి, జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి పాల్గొన్నారు.
వ్యవసాయేతర నోటరీ భూములక్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి
మున్సిపల్ పరిధిలో వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. నోటరీ ద్వారా కొన్న ల్యాండ్ను రెగ్యులర్ చేసుకునేందుకు కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్లైన్ మీ సేవా ద్వారా నోటరీ భూముల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇందుకు దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, ఆస్తి, విద్యుత్, నీటి పన్నుల రశీదులను జత చేసి మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులను ఆగస్టు నుంచి స్వీకరించనున్నట్లు చెప్పారు. నోటరీ భూముల కింద ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.