కడ్తాల్, జనవరి 7 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్డీడీసీఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ శివాల్కర్యాదవ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రాన్ని కడ్తాల్ పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ రాధికతో కలిసి పరిశీలించారు. పాల సేకరణ కేంద్రంలోని పాడి రైతుల వివరాలు, ప్రతి రోజు ఎన్ని లీటర్ల పాలు సేకరిస్తున్నారో తదితర విషయాలను పాల సేకరణ కేంద్రం నిర్వాహకుడిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాడి రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివాల్కర్యాదవ్ మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. పాడి రైతులను ప్రోత్సహించడానికి పాల సేకరణ ధరను పెంచినట్లు గుర్తు చేశారు. విజయ డెయిరీలో పాలు పోసే రైతులకు పదిహేను రోజులకు మొబైల్ యాప్ ద్వారా పాల బిల్లును చెల్లిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల సేకరణ నిర్వాహకుడు నవీన్, పాడి రైతులు వెంకటయ్య, తావుర్యానాయక్, రవి, మహేశ్, ఫకీరా, శ్రీనివాస్, పంతూ, మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.