సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఔటర్ రింగు రోడ్డు సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ మీద సైకిళ్లు దూసుకుపోతున్నాయి. నగరంలో సైక్లింగ్ను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ మేర అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ను నిర్మించింది. అంతేకాకుండా ప్రత్యేక చొరవ తీసుకొని సైకిల్ ట్రాక్ మీద సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో పాటు దాని వెలుతురులో హాయిగా సైక్లింగ్ చేసుకునే సైక్లింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.
సొంత సైకిళ్లు ఉన్న వారు నేరుగా ఈ ట్రాక్పై సైక్లింగ్ చేసే అవకాశం ఉండగా, లేని వారి కోసం అద్దెకు సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మొదటి సైకిల్ స్టేషన్ను నార్సింగి హబ్లో ఏర్పాటు చేసి సుమారు 200 సైకిళ్లను అందుబాటులో ఉంచగా, అందులో 40కి పైగా ఎలక్ట్రిక్ సైకిళ్లు సైతం ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. అద్దెకు ఇచ్చే సైకిల్కు గంటలకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు. 24కి.మీ ఓఆర్ఆర్ సైకిల్ ట్రాక్పై 4 చోట్ల సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, అందులో తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను సైకిల్ స్టేషన్ల కోసం ఎంపిక చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం నార్సింగి హబ్లో సైకిళ్లు అద్దెకు అందుబాటులో ఉండగా, త్వరలోనే మిగతా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.