కులకచర్ల, నవంబర్ 8 : కులకచర్ల శ్రీరామలింగేశ్వర సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం వివిధ రకాలుగా వ్యాపారాలు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతంలో చిరుధాన్యాలను సేకరించడంతో పాటు మామిడి కాయల సేకరణ, విక్రయాలు నిర్వహించేది. కానీ నేడు సీతాఫలాలు సేకరించేందుకు అటవీశాఖ ద్వారా టెండర్ను తీసుకొని మండలంలోని సీతాఫలాలు లభించే దగ్గరకు వెళ్లి నేరుగా విక్రయదారుల నుంచి సీతాఫలాలను సేకరించి హైదరాబాద్ మార్కెట్కు తరలించి లాభాలు ఆర్జించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో దళారులు లబ్ధిదారుల నుంచి సీతాఫలాలు కేవలం 150 రూపాయల నుంచి 200వరకు మాత్రమే ఇచ్చి వారి దగ్గర బుట్టలు చొప్పున కొనుగోలు చేసేవారు. కానీ ఎఫ్పీవో ద్వారా సీతాఫలాల సేకరణ ప్రారంభం కావడంతో మార్కెట్లో రేటును బట్టి బుట్టకు రూ.250నుంచి 350వరకు విక్రయదారులకు ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నారు.
సీతాఫలాల సేకరించేందుకు కులకచర్ల ఎఫ్పీవో ద్వారా రూ.2లక్షలతో సబ్ టెండర్ను తీసుకొని సీతాఫలాల విక్రయాన్ని కొనసాగిస్తున్నారు. కులకచర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో సీతాఫలాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి వాహనాల ద్వారా సిబ్బంది సేకరించిన సీతాఫలాలను మార్కెట్కు తరలిస్తున్నారు. ఎఫ్పీవో ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయంతో కులకచర్ల ఎఫ్పీవో సభ్యులు తమ సెర్ప్ సిబ్బంది సహకారంతో సీతాఫలాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నది. ప్రతి రోజూ సీతాఫలాలను సేకరించి మార్కెట్కు తరలిస్తున్నారు. కులకచర్ల శ్రీరామలింగేశ్వ సిరిధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం సీతాఫలాల సేకరణలో లాభాలతో ముందుకు సాగుతున్నది. ఎఫీపీవో పరిధిలో ఉన్న గ్రామాలకు రాత్రింబవళ్లు వెళ్తుతూ ఇతరులు సీతాఫలాలు తీసుకెళ్లకుండా ఉండేందుకు సిబ్బంది రాత్రిపగలు గస్తీ కాస్తూ సీతాఫలాల సేకరణ చేపట్టి ఆశించిన స్థాయిలో వ్యాపారం కొనసాగుతుందని ఎఫ్పీవో సభ్యులు పేర్కొంటున్నారు.
ప్రతి రోజూ రాత్రి గస్తీ చేస్తున్న సిబ్బంది..
ఎఫ్పీవో ద్వారా సీతాఫలాల సేకరణ చేస్తున్నందున రెండు లక్షలతో మండలంలో టెండర్ వేసిన తరువాత ప్రతి రోజు సీతాఫలాలు సేకరించి మార్కెట్కు తరలించాలని డీఆర్డీవో సెర్ప్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో డీఆర్డీవో ఆదేశాల మేరకు ప్రతి రోజు సెర్ప్ సిబ్బంది గ్రామాల్లో రాత్రి పగలు తిరుగుతూ ఇతరులు సీతాఫలాలు మార్కెట్కు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో సీతాఫలాల సేకరణ విజయవంతంగా కొనసాగుతున్నదని ఎఫ్పీవో సభ్యులు పేర్కొంటున్నారు.
రాంపూర్లో సేకరించిన సీతాఫలాల బుట్టలు
గ్రేడింగ్ చేసి విక్రయం…
కులకచర్ల ఎఫ్పీవో ద్వారా సేకరిస్తున్న సీతాఫలాలు గ్రేడింగ్ చేసి మార్కెట్కు తరలిస్తున్నారు. మంచి గ్రేడు ఉన్న సీతాఫలాలు మంచి రేటును విక్రయదారులకు అందిస్తున్నారు. గ్రేడింగ్ ప్రకారం సీతాఫలాలకు డబ్బులు చెల్లిస్తున్నారు.
మరో వారం సేకరణ ఉంటుంది..
కులకచర్ల శ్రీరామలింగేశ్వర ఎఫ్పీవో ద్వారా సీతాఫలాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సెర్ప్, డీఆర్డీవో ఆదేశాల మేరకు మండలంలో మూడు గ్రామాలు మినహా అన్ని గ్రామాల్లో మా సిబ్బంది వెళ్లి సీతాఫలాలు తమ ఎఫ్పీవోకు ఇవ్వాలని తెలియజేయడంతో పాటు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. మరో వారం పాటు సీతాఫలాల సేకరణ కొనసాగుతుంది.
– శోభ, ఏపీఎం కులకచర్ల
మంచి లాభాలు వస్తున్నయి..
సీతాఫలాల సేకరణతో వ్యాపారం బాగా ఉంటుంది. కులకచర్ల ఎఫ్పీవో ద్వారా 45 రోజుల నుంచి సీతాఫలాలను సేకరించే పనుల్లో తమ సెర్ప్ సిబ్బంది పనిచేస్తున్నారు. గతంలో టెండర్కు పెట్టుబడి కూడా వస్తుందా అనే భయం ఉండేది. కానీ సిబ్బంది కష్టపడి పనిచేయడం ద్వారా మంచి లాభాలు వస్తున్నయి.
– శ్రీదేవి, ఎఫ్పీవో అధ్యక్షురాలు కులకచర్ల