స్థూల వ్యవసాయ సాగులో 31.6 శాతం వృద్ధి
2019-20 కంటే 2020-21లో పెరిగిన సాగు విస్తీర్ణం
29.2 శాతానికి పెరిగిన ఎరువుల వినియోగం
సాగు పెంపులో రాష్ట్రంలోనే రెండో స్థానంలో వికారాబాద్ జిల్లా
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నది. రైతుబంధు పథకం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతన్నలకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర గణాంకాల శాఖ తెలంగాణ సోషియో ఎకానమీ అవుట్లుక్- 2022లో వెలువరించిన ప్రకారం స్థూల వ్యవసాయ సాగులో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది.
పరిగి, జూన్ 23 : తెలంగాణ వస్తే ఏమొచ్చింది అనేవారికి సమాధానం ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అమలుచేస్తున్న రైతు బంధు పథకం, 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటును ఉచితంగా అందించడం, రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ రాకముందు వికారాబాద్ ప్రాంతంలో పంటల సాగు విస్తీర్ణం చాలా తక్కువ. 2016లో వికారాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తోడ్పాటుగా ఉంటూ అన్ని రకాలుగా సహకరిస్తుండడంతో ప్రస్తుతం వికారాబాద్ జిల్లా స్థూల వ్యవసాయ సాగులో రాష్ట్రంలోనే నం.2గా నిలిచింది. రాష్ట్ర గణాంకాల శాఖ తెలంగాణ సోషియో ఎకానమీ అవుట్లుక్ 2022 వెలువరించిన ప్రకారం వికారాబాద్ జిల్లా సాగులో దూసుకుపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థల నుంచి సేకరించిన వివరాల ప్రకారం గణాంకాల శాఖ రూపొందించిన ఎస్ఈవో 2022లో వికారాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో వేగంగా విస్తరిస్తున్నదని తేలింది.
రైతు బంధు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో పెరిగిన సాగు
టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా పంటల సాగుకు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద చేయి చాచరాదనే ఉద్దేశంతో రైతు బంధు కింద ఎకరాకు రూ.10వేలు సంవత్సరానికి రెండు సీజన్లకు కలిపి అందజేస్తున్నది. 2018 వానకాలం నుంచి ప్రారంభమైన రైతు బంధు పథకం ద్వారా 8 విడుతల్లో వికారాబాద్ జిల్లాలోని రైతులకు రూ.2211కోట్లు పెట్టుబడి సాయంగా అందజేశారు. జిల్లాలో 66423 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా వాటిలో బోర్లు, వ్యవసాయ బావులు సైతం ఉన్నాయి. వాటి కింద పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. భూగర్భ జలాలు పెరుగడం ద్వారా మిగతా పంటల కంటే ఎక్కువగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఇందుకు మరో కారణం వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అని చెప్పవచ్చు. గతంలో లోవోల్టేజీ, ఇచ్చే 6 గంటలు రెండు విడుతల్లో సరఫరా జరిగేది. తెలంగాణ వచ్చిన ఏడాది తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కరెంటు కష్టాలను గట్టెక్కించడంతోపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా వ్యవసాయానికి ప్రయోజనకారిగా మారింది. అలాగే జిల్లా పరిధిలో 1179 చెరువులు, ఒక మధ్య తరహా ప్రాజెక్టు ఉన్నాయి. వాటి కింద 88,497 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. పుష్కలంగా వర్షాలు కురువడంతో చెరువులన్నీ నీటితో నిండిపోయి పంటల సాగు విస్తీర్ణం పెరుగడానికి దోహదం చేసిన మరో కారణంగా పేర్కొనవచ్చు. వీటితోపాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును ప్రభుత్వం నేరుగా చేపట్టడంతో రైతుల్లో భరోసా కలిగింది. వరి ధాన్యం, పెసర, కందులు, పత్తి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ధాన్యం కొనుగోలుకు ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉండే మార్కెట్లకు వెళ్లకుండా తమ గ్రామంలోని కేంద్రాల్లోనే మద్దతు ధరకు విక్రయించే సదుపాయం కలిగింది. కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమ చేయడం సైతం రైతాంగంలో మరింత నమ్మకాన్ని పెంచింది. దీంతో రైతులు ఏ పంటలు సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే భరోసా సైతం స్థూల వ్యవసాయ సాగు పెంపునకు దోహదం చేసిందని చెప్పవచ్చు.
జిల్లాలో 31.6 శాతం పెరిగిన సాగు
వికారాబాద్ జిల్లా పరిధిలో 2019-20 వానకాలం, యాసంగి రెండు సీజన్లలో సాగు చేసిన పంటల విస్తీర్ణం కంటే 2020-21లో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరగడం గమనార్హం. 2019-20 వానకాలంలో 4.79 లక్షలు, యాసంగిలో 63,200 ఎకరాల్లో సాగు జరిగింది. 2020-21లో వానకాలంలో 5.97లక్షలు, యాసంగిలో 1.21 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. దీంతో రెండు సీజన్లు కలిపి 7.19లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. ఏడాది కాలంలో స్థూల వ్యవసాయ సాగు విస్తీర్ణం 31.6శాతం పెరగడం గమనార్హం. దీంతొ స్థూల వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరగడంలో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే నం.2 స్థానంలో నిలిచింది. 2019-20లో వానకాలం, యాసంగి రెండు సీజన్లలో కలిపి వరి పంట సాగు విస్తీర్ణం 66100 ఎకరాలు ఉండగా 2020-21లో 80శాతం పెరిగి 1.19లక్షల ఎకరాలకు పెరగడం గమనార్హం. మరోవైపు సాగు విస్తీర్ణం పెరగడానికి భూగర్భ జలమట్టం పెరగడం సైతం అని చెప్పవచ్చు. భూగర్భ జల వనరుల శాఖ అందించిన వివరాల ప్రకారం 2019-20లో సరాసరి భూగర్భ జలమట్టం 15.7 మీటర్లు ఉండగా 2020-21లో 9.20 మీటర్లకు పెరిగింది. దీంతో బోర్లు, చెరువుల కింద సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడానికి మరో కారణంగా పేర్కొనవచ్చు.
ఎరువుల వినియోగం 29.2 శాతం
వికారాబాద్ జిల్లా పరిధిలో సాగు చేసిన వివిధ రకాల పంటలకు ఎరువుల వినియోగంలోనూ 29.2శాతం పెరిగింది. 2019-20 వానకాలంలో 45551 మెట్రిక్ టన్నులు, యాసంగిలో 14632.5 మె.ట మొత్తం 60183.5 మె.ట ఎరువుల వినియోగం జరిగింది. 2020-21లో వానకాలం సీజన్లో 58344.2 మె.ట, యాసంగిలో 18839 మె.ట.. మొత్తం 77183.2 మె.ట ఎరువుల వినియోగం జరిగింది. జిల్లాలోని నేలల స్వభావం, సాగు చేసిన పంటలు, వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణం.. ప్రధానంగా వరి పంట సాగు పెరగడం వల్ల సైతం ఎరువుల వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఒకే సంవత్సరంలో వికారాబాద్ జిల్లాలో 29.2శాతం ఎరువుల వినియోగం పెరగగా ఎరువుల వినియోగంలో రాష్ట్రంలో జిల్లా 16వ స్థానంలో నిలిచింది.
పెరిగిన స్థూల వ్యవసాయ సాగు
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో స్థూల వ్యవసాయ సాగు పెరిగింది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురువడంతో భూగర్భ జలాలు పెరుగడం, ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు ద్వారా ఎకరాకు సంవత్సరానికి రూ.10వేలు అందించడం, నాణ్యమైన, నిరంతర కరెంటు సరఫరా, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వంటి వాటితో జిల్లాలో స్థూల వ్యవసాయ సాగు పెరిగింది. 2019-20తో పోలిస్తే 2020-21లో వికారాబాద్ జిల్లాలో స్థూల వ్యవసాయ సాగు 31.6 శాతం పెరిగింది. నేలల స్వభావంతో పాటు వివిధ పంటలు సాగు విస్తీర్ణం పెరుగుదలతో ఎరువుల వినియోగం పెరిగింది.