చాలాకాలం తర్వాత రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఒట్టిపోయిన నీటి వనరులు.. కరెంట్ కోతలు.. బీటలు వారుతున్న పొలాలు.. రైతాంగానికి పాత రోజులను గుర్తుకు తెస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ పాలన రైతన్నల గుండెల నిండా భరోసా నింపగా.. ప్రస్తుతం రైతన్న గుండె కోతతో తల్లడిల్లుతున్నది. పెట్టుబడులకు డబ్బులు లేక అరకొరగా పంటలను సాగు చేసిన రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తున్నది. జిల్లాలో 2,170 చెరువులు ఉండగా.. చాలా వాటిల్లో నీటి మట్టాలు అడుగంటి పోయాయి. సాగు విస్తీర్ణం తగ్గి యాసంగి సాగు తలకిందులు కావడంతో రైతు కుటుంబాలు ఆందోళనతో గడుపుతున్నాయి. గడచిన పదేండ్ల కాలంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదురుకాలేదని రైతాంగం పేర్కొంటున్నది.
రంగారెడ్డి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో సాగు నీటికి కటకట నెలకొన్నది. ఈ ఏడాది జులై, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో వర్షాలు బాగానే కురిసినప్పటికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ఈ మూడు నెలల వ్యవధిలో మొత్తం 128.2మి.మీ.ల వర్షపాతం కురవాల్సి ఉండగా..23.7మి.మీ.లు మాత్రమే కురిసింది. మొత్తంగా 81.5మి.మి.ల లోటు వర్షపాతం నమోదైంది.
గత యేడాది నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో 5.02 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 8.2 మీటర్ల లోతులోకి పడి పోయాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జలాలు మరింత లోతుల్లోకి వెళ్లాయి. దీంతో బోర్లు, బావుల్లో నీటి మట్టాలు అడుగంటి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అడుగంటిన భూగర్భ జలాలతో బోర్లు సైతం ఆగిఆగి పోస్తుండడంతో పంటలకు పూర్తి స్థాయిలో నీరందడం లేదు. చెరువులు, కుంటలపై ఆశలు పెట్టుకోగా..అవి సైతం రోజురోజుకూ అడుగంటుతుండడంతో రైతుల పరిస్థితి నిరాశజనకంగా ఉంది.
గత యేడాది యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 1,23,239 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేశారు. అయితే ఈసారి సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో యాసంగి సీజన్లో 80వేల నుంచి లక్ష ఎకరాల్లోనే పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుండగా..ఆ మేరకు కూడా పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సీజన్ ముగియనున్నప్పటికీ చాలా భూముల్లో రైతులు పంటలను సాగు చేయక పడావుగా ఉంచారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60వేల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. గత యాసంగిలో మండు వేసవిలోనూ చెరువులు, కుంటలు నిండు కుండల్లా ఉండి.. పచ్చని పంటలతో కళకళలాడిన పొలాలు నేడు కళ తప్పిపోయి కన్పిస్తున్నాయి.
ఈ ఏడాది వానలు లేక చెరువులు ఎండిపోయాయి. ఎండలు ఎక్కువగా కొడితే ఉన్న బోర్లు ఆపి పోస్తాయి. సాగునీటికి కష్ట కాలం తప్పేటట్టు లేదు. గతేడాది చెరువు, కుంటల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈసారి అవి మొత్తం ఎండిపోయాయి. కేసీఆర్ ఉన్నన్ని రోజులూ సాగునీటికి డోకాలేకుండే. పదేండ్లు చెరువుల్లో సరిపడా నీళ్లుండి ప్రతి వానకాలంలో మూడు, నాలుగు నెలలు చెరువులు అలుగులు దుంకేవి. పంటలు పుష్కలంగా పండేవి. కానీ ఈసారి నీళ్లు లేక పంటలు ఎండిపోతాయేమోనని భయంగా ఉన్నది. భూగర్భంలో నీళ్లు అడుగంటితే రైతులకు కన్నీళ్లు తప్పవు. రానున్న రోజుల్లో వానాలు రాకపోతే రైతుల బతుకులు ఆగమైతయ్. చెరువు కింద పొలమున్నప్పటికీ నీటికి కటకట మొదలైంది.
– కాశమల్ల సత్తయ్య, రైతు మేడిపల్లి