రంగారెడ్డి, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు శిబిరాల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో 3,81,426 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,335 మందికి కండ్లద్దాలు పంపిణీ చేశామని, 77,142 ప్రిస్క్రిప్షిన్ కళ్లద్దాలను ఆర్డర్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా శాంతికుమారి కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు.
ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని, శని, ఆదివారాలు క్యాంపులు ఉండవని సీఎస్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9:15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్డేట్ చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకొని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులు, ఉద్యోగులు, పోలీసులు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజుల్లో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్నచిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న కండ్లద్దాల స్టాక్ను కలెక్టర్లు ప్రతిరోజూ పర్యవేక్షించాలని, అవసరమైన కండ్లద్దాల స్టాక్ వివరాలు పాయింట్లవారీగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
రెండు రోజుల్లో 17,892 మందికి కంటి పరీక్షలు
ఈ కాన్ఫరెన్స్లో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో రెండు రోజుల్లో 17,892 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 3,959 మందికి రీడింగ్ కండ్లద్దాలు అందించామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు. కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
శిబిరాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన
వికారాబాద్ : క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తూ ప్రజలు పెద్దమొత్తంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వార్డు అధికారులు, రిసోర్స్ పర్సన్లకు వేర్వేరుగా పనులు అప్పజెప్పి కంటి పరీక్షలు పకడ్బందీగా చేసుకునేలా చూడాలని తెలిపారు. అధికారులు ప్రణాళికబద్దంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఆర్వో అశోక్కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పాల్వన్కుమార్, డీపీవో తరుణ్కుమార్, పరిగి, కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.