అకాల వర్షంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములతో వాన పడుతుండడంతో వరి, కూరగాయల పంటలు దెబ్బతినగా, మామిడి, బత్తాయిలు నేలరాలాయి. పలు గ్రామాల్లో వడగండ్లవాన కురువడంతో పంట నష్టం తీవ్రత మరింత పెరిగింది. పలుచోట్ల కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పంటపొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 849 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 14 గ్రామాల్లో ప్రభావం అధికంగా ఉందని తేల్చారు. అలాగే వికారాబాద్ జిల్లావ్యాప్తంగా అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టంపై నివేదికలు తయారు చేస్తున్నారు.
రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలకు పలు రకాల పంటలు నేల పాలయ్యాయి. మరో నెల రోజుల్లో చేతికి వస్తాయనుకుంటున్న పంటలు తడిసి పోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు మండలాల్లో పంట లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. గురువా రం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు తీవ్రమైన గాలులతో కురిసిన భారీ వర్షానికి వరి, టమాట, ఆముదం, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతినగా అన్నదాతలకు భారీ నష్టం సంభవించింది. కల్లాలు, మార్కెట్లలో ఉన్న మిర్చితోపాటు వరి ధాన్యం కూడా తడిసి ముద్దయింది. ఇలా జిల్లాలోని పలు మండలాల్లో రైతులు చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు అనేక అవస్థలు పడ్డారు. జిల్లాలో ప్రతి ఏటా లక్షా75 వేల ఎకరాల పైచిలుకు వివిధ రకాల పంటలు సాగువుతున్నాయి. కాగా, ఈ రెండు రోజుల్లో కురిసిన వర్షానికి దాదాపుగా 849 ఎకరాల్లో పంటలు నేల పాలైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపుగా 14 గ్రామాల్లో వాన ప్రభావం ఉన్నట్లు తెలిపారు.
ఈ అకాల వర్షాలతో జిల్లాలో అత్యధికంగా వరి పంట దెబ్బతిన్నది. వరి పైరు పొట్ట విచ్చుకొని వెన్నులు (వరి కంకులు)గా మొలకెత్తే సమయంలోనే ఈ విపత్తు తలెత్తడంతో రైతులు ఆ పంటను కాపాడుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. జిల్లా లో 794 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది. ఈదురు గాలులకు పైరు సాగిలపడింది. ఒక్క యాచారం మండలంలో నే (మొండిగౌరెల్లి, మన్లాన్గాడ్, సుతాన్పూర్, నల్లవెల్లి, చింతపట్ల) 377 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మంచాల మండలంలో (బోడకొండ, శ్రీమంత్గూడ, లోయపల్లి, చీదెడ్, దడుపల్లి గ్రామాల్లో) 410 ఎకరాల్లో, ఆమనగల్లు (కొనాపూర్) మండలంలో 12 ఎకరాల్లో, యాచారం (నల్లవెల్లి) మండలం లో 10 ఎకరాల్లో ఎదుగుతున్న మామిడి కాయలు నేల రాలా యి. అదేవిధంగా ఆమనగల్లు మండలంలో 10 ఎకరాల్లో ఆముదం పంట పూర్తిగా నేలపాలు కాగా.. యాచారం మం డలం (చింతపట్ల, మొండి గౌరెల్లి)లో టమాట పంట 30 ఎకరాల్లో దెబ్బతిన్నది.
మర్పల్లి, మార్చి 18 : మండలంలో వడగండ్ల వానకు 1,792 ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నట్లు హార్ట్టికల్చర్ జిల్లా అధికారి చక్రపాణి తెలిపారు. గురువారం మండలంలో కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మర్పల్లి, బూచన్పల్లి, కోట్మర్పల్లి, కుడుగుంట, రావులపల్లి, పంచలింగాల్, కొత్లాపూర్, వీర్లపల్లి, సిరిపురం, అల్లాపూర్ తదితర గ్రామాల్లో 36 మంది అధికారులతో కలిసి రైతుల పొలాల వద్దకు వెళ్లి వివరాలను సేకరించగా 1,792 ఎకరాల్లో పంటలు పాడైనట్లు తెలిపారు. అందులో ఉద్యానవన పంటలు 975 ఎకరాలు, వ్యవసాయ పంటలు 817 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏలు వినోద్, శంకర్, మల్లికార్జున్, ఏవో వసంత, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.
మోమిన్పేట, మార్చి 18 : మండలంలో మూడు రోజులుగా వడగండ్ల వాన కురుస్తున్నది. గురువారం కురిసిన వర్షానికి సైయ్యద్అలీపూర్, ఎన్కతల, చంద్రాయన్పల్లి తదితర గ్రామాల్లో అధికంగా పంటలు నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కురిసిన వడగండ్ల వానకు కూరగాయలు , మొక్కజొన్న, ఉల్లి, జొన్న, గోధుమ తదితర పంటలు పూర్తిగా ధ్వంసమైనట్లు వారు పేర్కొంటున్నారు. కాగా మండలంలో అకాల వర్షాల తో నష్టపోయిన పంటల వివరాలను శనివారం ఏవో జయశంకర్, వ్యవసాయాధికారులు క్షేత్రస్థ్ధాయిలో సందర్శించి పరిశీలించారు. మూడు రోజులు గా కురుస్తున్న వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో 760 ఎకరాల్లో ఉద్యాన, కూరగాయలు, పూలు తదితర పంటలు నష్టపోయినట్లు గుర్తించి నట్లు తెలిపారు. ఆ వివరాలను ఉన్నతాధికారులు పంపిస్తామన్నారు.
ధారూర్ : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది.. మోమిన్కలాన్ గ్రామంలో ఉరుములతో కూ డిన వర్షానికి గోపాల్ ఇంటి వెనుక ఉన్న కిటికిపై పిడుగు పడింది. దీంతో ఇల్లు మొత్తం పొగతో నిండిపోయింది.. ఈ ఘటనలో ఏలాంటి నష్టం జరుగలేదు.
వికారాబాద్, మార్చి 18 : వికారాబాద్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి, శనివారం సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. గత రెండు రోజులుగా వర్షం కురువడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పంట పొలాల్లో నీరు నిలువడంతో కూరగాయ పంటలు పాడైపోయాయి. వికారాబాద్ నుంచి సిద్ధలూర్ వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభాలు రోడ్డుపై పడ్డాయి. ఎర్రవల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వడగండ్లు పడ్డాయి. ఈ వర్షానికి చెరువులు, కుం టల్లో వర్షపు నీరు నిలిచింది. కూరగాయల పంటలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కోట్పల్లి, మార్చి 18 : చేతికొచ్చిన పంటలను శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం నీటిపాలు చేసింది. మండలంలో రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన వడగండ్ల వానకు మోత్కుపల్లి, నాససాన్పల్లి, బారువాద్, తదితర గ్రామాల్లోని రైతుల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. మోత్కుపల్లి గ్రామానికి చెందిన కిష్టారెడ్డి, విఠల్రెడ్డితోపాటు మరి కొంతమంది రైతులు సాగు చేసిన పంటలన్నీ నేలపాలయ్యాయి. కిష్టారెడ్డి ఎకరం పొలంలో టమాట, ఎకరంన్నర భూమిలో సోరకాయ, ఎకరంలో మిర్చి, మరో ఎకరం భూమిలో వాటర్ మిలాన్ పంటలను సాగు చేసి.. పెట్టుబడి పెట్టాడు. పంటలు చేతి కొచ్చే దశలో అకాల వర్షం కురియడంతో దాదాపుగా రూ.15 లక్షల వరకు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా మండలంలోని పలు గ్రామాల్లో టమాట, సోర, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు. పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదేవిధంగా రాంపూర్ గ్రామంలో రాత్రి కురిసిన వానకు రెండు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దాంతోపాటు ఆ గ్రామంలోనే రేకుల షెడ్డుపై వేసిన రేకులు గాల్లోకి ఎగిరిపోయాయి. రాత్రి సమయం కావడంతో ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కంకణాలపల్లిలో పులుమద్ది రాములు ఇల్లు వానకు కూలిపోయింది.
ఇబ్రహీంపట్నం, మార్చి 18 : నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి వెయ్యి ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇబ్రహీంప ట్నం, మంచాల, యాచారం మండలాల్లోని వ్యవసాయాధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. మంచాల మండలంలో 450 ఎకరాల్లో, యాచారం మండలంలో 500 , ఇబ్రహీంపట్నం మండలంలో 50 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించారు. యాచా రం మండలంలోని మంతన్గౌరెల్లి, మంతన్గౌడ్, శ్రీమంతగూడలో వరి, కూరగాయలు, మామిడితోటలకు నష్టం జరిగింది. అలాగే, ఇండ్లు కూడా వందల సంఖ్యలో ధ్వంసమయ్యా యి. మంచాల మండలంలో చీదేడు, రంగాపూర్, బోడకొండ, దాద్పల్లి, సత్తితండా, కొర్రవానితండాల్లో 450 ఎకరాల్లో పంటలకు నష్టంవాటిల్లింది. జరిగిన నష్టంపై ఇప్పటికే ఎమ్మె ల్యే, ఆర్డీవో గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చా రు. నివేదిక ఆధారంగా త్వరలోనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టంపై నివేదికను తయారుచేసి వ్యవసాయశాఖ అధికారులకు అందజేశాం. యాచారం మండలంలో 500 ఎకరాల్లో, మంచాల మండలంలో 450 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 50ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు గుర్తించడం జరిగింది. పంట నష్టంపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుంది.
-సత్యనారాయణ, ఏడీఏ వ్యవసాయశాఖ
మొయినాబాద్, మార్చి 18 : అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతోపాటు భారీ వృక్షాలు నేలకూలాయి. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేల రాలిపోయాయి. శుక్రవారం రాత్రి ఈదు రు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో రోడ్ల పక్కన ఉన్న భారీ వృక్షాలు నేలపై పడిపోయాయి. రాత్రి నుంచి ఉదయం వరకు విద్యు త్ సరఫరాలో తీవ్ర అంతరా యం ఏర్పడింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీ య రహదారి పక్కన పెద్ద, పెద్ద చెట్లు కూలిపోయాయి. దీంతో రాత్రి నుంచి ఉద యం వరకు వాహనదారులు ఇబ్బందిపడ్డా రు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి రోడ్డుపై వాహనాల రాకపోకలకు అడ్డంగా ఉన్న చెట్లను పక్కకు తొలగించారు. అదేవిధంగా అజీజ్నగర్ చౌరస్తాలో రోడ్డుపై వర్షం నీరు నిలిచి ఉండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో అజీజ్నగర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు జేసీబీతో ఆ సమస్యను పరిష్కరించారు.
అకాల వర్షానికి కూరగాయలు, పూల తోట లు, వరి పంట దెబ్బతిన్నది. పంటలు నీట మునగడంతో పెట్టిన పెట్టుబడి నీటిపాలు అయ్యిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరులో శ్రీశైలం సాగు చేసిన టమాట, పూలు, ఉల్లిగడ్డ నీట మునిగాయి. అదేవిధంగా కేతిరెడ్డిపల్లి, సురంగల్, తోలుకట్టా, నక్కలపల్లి, ఎతుబార్పల్లి, రెడ్డిపల్లి, చిన్నమంగళారం, బాకారం, నాగిరెడ్డిగూడ, అజీజ్నగర్, ఎన్కేపల్లి, ముర్తుజాగూడ, చిలుకూరు, కనకమామిడి, ఎల్కగూడ, కుతుబుద్దీన్గూడ గ్రామాల్లో ఉన్న మామిడి తోటల్లో మామిడి కాయలు నేల రాలడంతో రైతులు ఆందోళన చెందారు. దెబ్బతిన్న పం టలను చిలుకూరులో వ్యవసాయ విస్తరణాధికారి సునీల్కుమార్ పరిశీలించారు.