వికారాబాద్, జనవరి 14, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రైతుల వారీగా ఏ సర్వే నంబర్లో ఏ పంట ఎంత విస్తీర్ణం, విత్తన రకం, ప్రధాన, అంతర పంట, నీటి వసతి వివరాలతోపాటు రైతుల సంతకాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని, రాష్ట్ర సర్కార్ ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నదని సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 19,513 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా, 5,821 ఎకరాల పంటల వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 57,321 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా, 44,909 ఎకరాల పంటల వివరాలు ఆన్లైన్లో నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది యాసంగి సీజన్కు సంబంధించి లక్ష ఎకరాలకు మించి సాగవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు 57,321 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది వరి సాగు అంచనాలకు మించి సాగవుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు వరి సాగు 2,721 ఎకరాల్లో చేశారు. గత వారం రోజుల నుంచి వరి నాట్లు వేయడం జిల్లాలో ప్రారంభమైనందున, ఫిబ్రవరి మొదటి వారం వరకు వరి సాగుకు అనుకూలమని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో వరి 80 వేల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. వర్షాలు సమృద్ధిగా కురువడం, 90 శాతం చెరువులు నిండి అలుగుపారుతున్న దృష్ట్యా వరి సాగు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
జిల్లాలోని కోట్పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టుల కింద 30 వేల ఎకరాలకు వరి సాగుకు నీరందించేందుకు జిల్లా నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా నీరందించే పంటలు మొత్తం వరిని మాత్రమే రైతులు సాగు చేయనున్నారు. గతేడాది ఆయా పంటల సాగు విస్తీర్ణం 1,04,528 ఎకరాలు కాగా.. ఈ ఏడాది 1,47,502 ఎకరాలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5,321 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, వరి 2711, కందులు-971, మొక్కజొన్న-4110, వేరుశనగ 21610, పొద్దుతిరుగుడు 5226, మినుములు-18410, ఆముదం తదితర పంటలు-28, చెరుకు-26 ఎకరాల్లో జిల్లా రైతాంగం సాగు చేసింది.
44,909 ఎకరాల్లో ఆన్లైన్..
జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు మొదలుకొని మండల, జిల్లా వ్యవసాయాధికారులు పర్యటిస్తూ రైతుల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. రైతులవారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణంతోపాటు చేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలతోపాటు రైతుల సంతకాలను సేకరిస్తున్నారు. భూమి యజమాని ఫోన్ నంబర్ తదితర వివరాలను మరో యూనిట్గా తీసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రైతులు పండించే పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయించింది. పంటల వివరాల సేకరణలో భాగంగా నీటి ఆధారాలైన బోరు, బావులు, చెరువుల ద్వారా పారే వివరాలను, రైతులు సాగు చేస్తున్న పంటల ద్వారా రానున్న దిగుబడి వివరాలను కూడా అంచనా వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 44,909 ఎకరాల్లో ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపర్చే ప్రక్రియ పూర్తయింది.
వ్యవసాయరంగ అభివృద్ధికి పెద్దపీట
షాబాద్ : తెలంగాణలో రైతుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వ్యవసాయరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసే పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతులు ఏ సర్వే నంబర్లో.. ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను సేకరిస్తున్నారు. పది రోజులుగా జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ సిబ్బంది సాగు వివరాల సేకరణ పనిలో నిమగ్నమయ్యారు. రంగారెడ్డిజిల్లాలోని 27 మండలాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్కు 85,477 ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 19,513 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు చెబుతున్నారు. జిల్లాలో 83 మంది వ్యవసాయశాఖ సిబ్బంది(ఏఈవోలు)తమ క్లస్టర్ల పరిధిలోని గ్రామాల్లో ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటించి రైతుల పంటల వివరాలను సేకరిస్తున్నారు. అనంతరం వారి ట్యాబ్ల ద్వారా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 19,513 ఎకరాల్లో పంటల సాగు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధి 27 మండలాల్లోని గ్రామాల్లో యాసంగి సీజన్కు 85,477 ఎకరాల్లో పంటలు సాగు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 19,513 ఎకరాల్లో రైతులు పలు రకాల పంటలను సాగు చేసినట్లు సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో వరి 472, జొన్న 188, మక్కజొన్న 2562, శనగ 4190, ఉలవలు 84, వేరుశనగ 3652, కుసుమ 4482, మరో 3883 ఎకరాల్లో టమాట, వంకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, చిక్కుడు, మిరప, బీట్రూట్, క్యారెట్ తదితర పంటలను సాగు చేస్తున్నారు. రైతుల పట్టాదారు పాసు బుక్కుల ఆధారంగా వ్యవసాయశాఖ సిబ్బంది రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటల వివరాలు తీసుకుంటున్నారు. గ్రామానికి వెళ్లే ఒక రోజు ముందుగానే రైతులకు సమాచారం అందించి, మరుసటి రోజు ఆ గ్రామానికి వెళ్తున్నారు. బోరుబావుల కింద ఈ ఏడాది అత్యధిక శాతం వరి పంటతో పాటు వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం వరకు పంటలు సాగు చేసుకునే అవకాశాలున్నాయని సంబంధిత వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఆన్లైన్లో ఉంటేనే పంట కొనుగోలు
రైతులు పండించిన పంటల వివరాలు ఆన్లైన్లో ఉంటేనే దిగుబడి వచ్చిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. పంటల వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. వ్యవసాయశాఖ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించిన తర్వాతనే ఆన్లైన్లో వివరాలను నమోదు చేస్తున్నారు. పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, సలహాలు, సూచనలు కూడా అందిస్తున్నారు. పంటల సాగుకు మరికొంత సమయం ఉండడంతో అప్పటివరకు వంద శాతం ఆన్లైన్లో నమోదు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.