వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు. పొలం దున్నడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, ఎరువులు చల్లడం, పంటల కోతలు, మందుల పిచికారీ ఇలా అన్నీ యంత్రాల సాయంతోనే చేపడుతున్నారు. గ్రాస్ కట్టర్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, వీడర్లు, డ్రోన్లు ఇలా ఎన్నో ఆధునిక యంత్రాలతో సాగును సుఖమయం చేసుకుంటున్నారు. దీంతో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది.
రంగారెడ్డి జిల్లాలో ఏడాదికి 5.50లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. యంత్రాలను సొంతంగా కొనుగోలు చేయలేని వాళ్ల కోసం ప్రభుత్వం కస్టమ్స్ హైరింగ్ కేంద్రాల ద్వారా యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచింది. రైతులు నామమాత్రపు అద్దె చెల్లించి వాటిని వినియోగిస్తున్నారు. సమాజంలో మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సాగులోనూ కొత్త పోకడలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు మల్చింగ్, డ్రిప్పులు, పాలీహౌస్ల పద్ధతుల్లో పంటలను సాగు చేస్తూ లభాలు ఆర్జిస్తున్నారు.
రంగారెడ్డి, జనవరి 27 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతుల నుంచి అన్నదాతలు బయటకు వస్తున్నారు. అనాదిగా కాడెద్దులు కట్టుకొని వ్యవసాయం చేసే తీరుకు రైతన్న స్వస్తి చెబుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసేలా రైతన్న కొంగ్రొత్త ఆలోచన విధానానికి తెర తీశాడు. ఈ విధానం గతంలో ఉన్నప్పటికీ.. అది ఏ కొద్దిమందికో మాత్రమే సులువైనది. భూమి వందల ఎకరాల్లో ఉన్నవారికి మాత్రమే గతంలో యంత్రాలతో పని చేసే అవకాశముండేది. పశువులతో వ్యవసాయం చేసే పద్ధతికి ఇప్పటికే చాలా చోట్ల రైతులు ఫుల్స్టాప్ పెట్టేశారు. ప్రస్తుతం వ్యవసాయం అంతా ఆధునిక పద్ధతుల్లోనే జరుగుతున్నది. తక్కువ మోతాదులో వ్యవసాయం ఉన్నవారు రెండు ఎద్దులు, ఒక నాగలి, తదితర పనిముట్లతో సాగు చేసుకుంటున్నారు.
రైతులంతా ఇప్పుడు మిషనరీలు వినియోగించి వ్యవసాయాన్ని సైతం హైటెక్ దిశగా మలిచారు. ప్రస్తుతం వ్యవసాయం దాదాపు ట్రాక్టర్లతోనే కొనసాగుతున్నది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్త కొత్త యంత్ర పరికరాలతో కొనసాగుతున్నది. భూమిని చదును చేసేందుకు, విత్తనాలు విత్తేందుకు రోజులు, వారాల తరబడి జరిగే వ్యవసాయ సాగును ప్రస్తుతం అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను వినియోగించి రెండు, మూడు రోజుల్లోనే ముగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏడాదికి 5 లక్షల 50 వేల ఎకరాలకు పైనే వ్యవసాయ సాగు జరుగుతున్నది. వీటిలో పదిహేను నుంచి 20 వేల ఎకరాల వరకు మాత్రమే అలనాటి మూస పద్ధతిలో సాగు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.
జిల్లా అంతటా వ్యవసాయ సాగు యంత్ర పరికరాలపై ఆధారపడి కొనసాగుతున్నది. ప్రపంచంలో రోజురోజుకూ చోటు చేసుకుంటున్న మార్పులకనుగుణంగా వ్యవసాయ సాగులోనూ కొత్త పోకడలు అందుబాటులోకి వచ్చాయి. సమయం, ఖర్చు, శ్రమ ఆదా అవుతున్న తరుణంలో రైతన్నలు వీటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల పల్లెల్లో నూతన వ్యవసాయ పద్ధతులపై రైతన్నలకు ఆసక్తి పెరిగింది. తద్వారా ఆధునిక యంత్రాల వినియోగం కూడా పెరిగింది. గ్రామాల్లో గతంలో ఎన్నడూ చూడనివిధంగా మల్చింగ్, డ్రిప్పులు, పాలీహౌస్ల వంటివి అధికంగా వచ్చాయి.
లాభదాయకమైన పంటల వైపు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లా అధికార యంత్రాంగం రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ వారిని పలు రకాల కొత్త పోకడలు, లాభదాయకమైన పంటలపై అప్రమత్తం చేస్తున్నది. కొత్తగా వచ్చిన పోకడలను అందిపుచ్చుకోవడం, వ్యవసాయంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను రైతులకు చేరువ చేస్తున్నది. సాగు పద్ధతులను ఆధునిక పోకడల వైపు మళ్లించేలా అధికార యంత్రాంగం పని చేస్తున్నది.
ఆదాయ వనరుగా పాడి పరిశ్రమ
ప్రధానంగా పాడి పరిశ్రమను అధికారుల సలహాలతో రైతులు ప్రస్తుతం ఆదాయ వనరుగా మలుచుకున్నారు. వారికున్న భూముల్లో సాగుకు అనుబంధమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటల వంటి వాటిని పెంచుకుంటున్నారు. ఇంకా గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల చెరువుల వైపు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పండించిన పంటలకు భిన్నంగా రైతులు అనేక కొత్త పంటలను వేస్తున్నారు. రోజురోజుకూ కూలీలు తగ్గిపోవడంతో యంత్రపరికరాల వినియోగాన్ని రైతులు పెంచేశారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, ట్రాలీలు, వరి కోత మిషన్లు, నూర్పిడి యంత్రాలు, కుబోటోలు, జేసీబీలు, హిటాచీలను రైతులు అందుబాటులో ఉంచుకుంటున్నారు. సొంతంగా కొనుగోలు చేయలేని వాళ్లు అద్దె చెల్లించి వాటిని వినియోగిస్తున్నారు. వ్యవసాయాన్ని సులభతరం చేసి, లాభదాయకమైన పంట సాగుకు జై కొడుతున్నారు.
తులు సంప్రదాయ పద్ధతులను వీడి ఆధునికత వైపు అడుగులు వేస్తున్నారు. ఆధునిక పద్ధతులను అమితంగా ఇష్టపడుతున్నారు. కూరగాయలు, పూల తోటలు, పండ్ల తోటలు, మిర్చి సాగును ఎక్కువగా చేస్తున్నారు. రొటీన్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నారు. ప్రధానంగా సూక్ష్మ బిందు సేద్యం, మల్చింగ్ వంటి వాటి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం చేసేవారు మాత్రమే పాలీహౌస్, మల్చింగ్ను వినియోగించేవారు. ప్రస్తుతం గ్రామీణ వాతావరణంలోని చిన్న రైతులు కూడా వీటిని వినియోగిస్తున్నారు. రైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం శుభ పరిణామం.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
ఆధునిక యంత్రాల వినియోగంపై ఆసక్తి
భూమిని దున్నడం, చదును చేయడం, విత్తనాలు వేసే దగ్గర నుంచి నాట్లు, కలుపు నివారణ, కోతలు కోయడం, నూర్పిళ్లు చేయడం లాంటి అన్ని రకాల పనుల్లో యంత్రాల వినియోగం అధికంగా పెరిగింది. దీని ద్వారా మానవ సేవలు తక్కువైపోయాయి. మరోవైపు రైతులు సంప్రదాయ పంటలను వీడి, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ సాగులో దుక్కిని దున్నడం, నాట్లు, కలుపులు, వరికోతలు, పత్తి, మొక్కజొన్న, కంది పంటల సాగుకు ఇటీవల అధికంగా యంత్రాలను వినియోగిస్తున్నారు.
పంటల్లో క్రిమి నివారణ, చేనుకు చీడను నివారించేందుకు కూడా రైతులు మందుల పిచికారీకి బదులు స్ప్రేలు, డ్రోన్ యంత్రాలను కూడా కొంగ్రొత్తగా వాడుతున్నారు. గతంలో ఎకరం నుంచి రెండు ఎకరాలకు మందులు పిచికారీ చేయాలంటే రోజుల తరబడి సమయం పట్టేది. ప్రస్తుతం ఈ అత్యాధునిక యంత్రాల వల్ల ఒక్క రోజులోనే ఆ పనులను రైతులు చక్కబెడుతున్నారు. ఇంకా ఫారెస్ట్రీకి, టేక్ వుడ్, సుబాబుల్లను పెంచేందుకు జేసీబీలు, హిటాచీ లాంటి అత్యంత ఆధునిక యంత్రాలను వాడుతున్నారు. డీఆర్డీఏ వారు అందిస్తున్న యంత్రాలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో గంటకు కొంత పైకం ఇస్తూ వాడుతున్నారు. వ్యవసాయం చేయడం భారమైనప్పటికీ యంత్ర పరికరాల సాయంతో ప్రస్తుతం మెరుగ్గా కొనసాగుతున్నది.
ఆధునికత వైపు అడుగులు 30 గుంటల్లో పాలీహౌస్ వేశా..
మాది కౌకుంట్ల గ్రామం. 30 గుంటల్లో పాలీహౌస్ వేశాను. గతంలో పాలీహౌస్ అంటే తెలిసేది కాదు. గతంలో చేసే సంప్రదాయ వ్యవసాయం కంటే ప్రస్తుతం చేస్తున్న ఆధునిక వ్యవసాయం సరికొత్తగా, సమయం వృథా కాకుండా, లాభదాయకంగా ఉంది. గతంలో వేరే పంటలను వేశాను. ఇప్పుడు జెరబర పూల సాగును పాలీహౌస్లో ఆధునిక పోకడలతో చేస్తున్నాను. ఇంకొంచెం చేయాల్సింది కూడా ఉంది. ఎండలు, వానలకు పంటలు తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి.
– మల్లారెడ్డి, రైతు, కౌకుంట్ల, చేవెళ్ల మండలం
ఆధునిక పోకడలతో సాగు లాభదాయకం..
మూస పోకడలతో చేసిన వ్యవసాయంలో ఎన్నో నష్టాలను చవిచూశాం. ప్రపంచం ఆధునిక పోకడలతో ముందుకెళ్తున్నది. వ్యవసాయంలోనూ ఆ రకమైన అడుగులు ఎప్పటి నుంచో పడుతున్నాయి. ప్రస్తుతం సాగు పశువులతో కాకుండా పరికరాలు, యంత్రాలతో కొనసాగుతున్నది. అందులోనూ లాభదాయకంగా కొనసాగుతున్నది. బోలెడు సమయం ఆదా అవుతున్నది. నేను మా ఊరిలో పట్టు సాగు చేస్తున్నాను. ఇంకా వేరే పంటలను సైతం సాగు చేస్తున్నాను. అదీ.. ఆధునిక పోకడలతో ఎంతో ఉపయోగకరంగా ఉంది.
– సయ్యద్ రఫీక్, రైతు, తలకొండపల్లి మండలం
ప్రణాళికతో సాగు చేయాలి
మాది చన్వెల్లి గ్రామం. నాకున్న భూమిలో పాలీహౌస్ చేశాను. కొంత భాగం కూరగాయల సాగు కూడా చేపట్టాను. ఆధునిక పోకడల్లోనే సాగంతా చేపట్టాం. గతంలో కాలువలు తీసి చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పడంతా కేవలం డ్రిప్ ఇరిగేషన్తో చేస్తున్నాం. ట్రాక్టర్లు, యంత్రాలు ఉపయోగించి సాగు చేస్తున్నాం. కాలం కలిసి వస్తున్నది. శ్రమ కూడా తగ్గిపోయింది. ఒక ప్రణాళికతో సాగు చేస్తే అంతా లాభదాయకంగా కొనసాగుతుంది. వ్యవసాయం కూడా కొత్త పుంతల్లో కొనసాగడం మంచి పరిణామం.
– కె.యాదయ్య, రైతు, చన్వెల్లి