పెద్దేముల్ : మండల పరిధిలోని కందనెల్లి వాగులో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మస్తిపురం అంజప్ప(35) కూలీ పనులు చేసుకుంటూ తాండూరులోని గుమాస్తానగర్లో జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 10న అంజప్ప భార్య సుజాతతో గోడవపడి అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేదు.
ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం కందనెల్లి వాగులో అంజప్ప శవమై తేలాడు. సంఘటన స్థలంలో దొరికిన సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు అంజప్ప మృతికి గల ఆధారాలను సేకరిస్తున్నారు. భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.