సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను అదుపులో చేయడంలో సిబ్బంది పని తీరును తెలుసుకుంటూ బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు, రాత్రి సమయంలో విధులలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. మేడిపల్లి, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, మీర్పేట, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, చైతన్యపురి పోలీస్స్టేషన్లను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో విధుల్లో మరింత శ్రద్ధగా పనిచేయాలని, తద్వారా స్మగ్లింగ్, వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలను అణిచివేయవచ్చన్నారు. రాత్రి సమయంలో పనిచేసే ఉద్యోగులు, మహిళలు, ఇతరులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం వచ్చే ఫోన్ కాల్స్కు తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారని అధికారులకు సూచించారు. పోలీస్స్టేషన్కు సంబంధించిన వెహికల్ చెకింగ్ పాయింట్స్ను సందర్శించి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటూ గంజాయి క్రయ, విక్రయాలను అరికట్టాలని సూచించారు.