పరిగి : టీకాలతో కొవిడ్ నుంచి రక్షణ పొందవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. 15నుంచి 18ఏళ్ల లోపు వయసు గల వారందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. మంగళవారం పరిగి పట్టణంలోని సర్కారు దవాఖానలో టీనేజర్లకు టీకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మొదటి డోసు తీసుకున్న వారందరూ సకాలంలో రెండో డోసు టీకా వేయించుకోవాలని చెప్పారు. 15నుంచి 18 ఏళ్ల లోపు వారందరూ టీకాలు వేయించుకోవాలని, ఈ విషయమై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకొని తమ పిల్లలకు టీకాలు వేయించాలన్నారు.
టీకాలపై అపోహలు వద్దని, టీకా ద్వారా రక్షణ పొందవచ్చని చెప్పారు. ఆసుపత్రిలో సదుపాయాలు, ఆక్సిజన్ వసతి తదితర అంశాలు డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పరీక్షలు పెంచాలని, టీకాలు వేసే కార్యక్రమం మరింత వేగవంతంగా జరిగేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మాస్కులు ధరించకుండా బయట తిరిగే వారికి జరిమానాలు విధించాల్సిందిగా మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, ఆసుపత్రి ఇన్చార్జీ డాక్టర్ సత్యనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.