ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 2 : శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం సీవీఆర్ కళాశాలలో జరుపనున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకోసం అధికారులు సీవీఆర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు అబ్జర్వర్లు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇప్పటికే సీవీఆర్ కళాశాలలో స్ట్రాంగ్రూంలల్లో ఈవీఎంలను భద్రపర్చి కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఉంచారు. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టడం కోసం ఆయా నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం వచ్చే రాజకీయ పార్టీల ఏజెంట్ల కోసం టేబుళ్ల సమీపంలో జాలీలతో ఏర్పాటు చేసిన గ్యాలరీలను సిద్ధ్దం చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 3,27,583 కాగా, 2,45,105 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను రౌండ్లవారీగా విభజించి కౌంటింగ్ చేయనున్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం కేటాయించిన సిబ్బందికి శనివారం సీవీఆర్ కళాశాలలో శిక్షణ నిర్వహించారు. శిక్షణ పొందినవారిచేత ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను ఓపెన్ చేయనున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ఓట్ల లెక్కింపుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను తెరిచి ఓట్ల లెక్కింపు చేపడుతామన్నారవు. సాయంత్రం వరకు తుది ఫలితం వస్తుందని ఆయన తెలిపారు.
– రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ అనంతరెడ్డి