వికారాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి విత్తనాల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నది. ఓ వైపు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతుండగా, మరోవైపు బ్లాక్లో పత్తి విత్తనాల దందా జోరుగా సాగుతుండడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్ను బట్టి బ్లాక్లో అధిక ధరకు అమ్ముతున్నట్లు తెలిసింది. జిల్లాలో రేవంత్, ఆధ్య, యూఎస్-7067, సదానంద్ రకాల పత్తి విత్తనాలను అధిక డిమాండ్ ఉన్నది. దీంతో ఆ విత్తనాల కోసం రైతులు డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఇదే అదునుగా భావించిన ఫర్టిలైజర్ డీలర్లు విత్తనాలు స్టాక్ లేవంటూ బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏ రకం పత్తి విత్తనాలైనా ఒక ప్యాకెట్ ధర రూ.864గా ప్రభుత్వం నిర్ణయించగా.. డీలర్లు బ్లాక్లో ఒక్కో ప్యాకెట్పై అదనంగా రూ.వెయ్యికిపైగా విక్రయిస్తున్నట్లు తెలిసింది. అధికారులు తనిఖీలు చేసినా ఆధారాలు లభ్యం కాకుండా బిల్లు బుక్లో ప్రభుత్వ ధరనే రైతులకు రాసి ఇస్తుండడం గమనార్హం. జిల్లాలో పత్తి విత్తనాల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నప్పటికీ జిల్లా వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది.
ఫర్టిలైజర్స్ దుకాణాలను తనిఖీలు చేస్తున్న వ్యవసాయాధికారులు కేవలం విత్తనాల స్టాక్ ఎంత వచ్చింది.. ఎంతమేర విక్రయాలు జరిగాయి.. ఇంకా మిగిలి ఉన్న స్టాక్ వివరాలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప బ్లాక్లో అధిక ధరకు పత్తి విత్తనాల విక్రయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కొందరు వ్యవసాయాధికారుల ఈ బ్లాక్ దందాపై సమాచారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏదేమైనా బ్లాక్ దందాపై కలెక్టర్ దృష్టి పెట్టి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పత్తి విత్తనాలు అందేలా చర్యలు చేపట్టి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఏటా పత్తి రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్నారు. జిల్లా వ్యవసాయాధికారులు, పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పటికీ నకిలీ విత్తనాల దందా మాత్రం ఆగడం లేదు. నకిలీ విత్తనాలతో సాగు చేసి మోసపోయామని తెలిసేలోగా అదును దాటి మళ్లీ విత్తనాలు నాటే పరిస్థితి లేకుండా పోతున్నది. జిల్లాలో ఇప్పటివరకు నకిలీ విత్తనాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో దాడులు చేసి కొడంగల్, యాలాల, దౌల్తాబాద్ మండలాల్లో రూ.39 లక్షల విలువ చేసే 23 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
గతేడాది నకిలీ విత్తనాలకు సంబంధించి మూడు కేసులు నమోదుకాగా, రూ.14.77 లక్షల విలువ చేసే 11.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను, 2022-23లో నకిలీ పత్తి విత్తనాలకు సంబంధించి 8 కేసులు నమోదుకాగా, రూ.35.28 కోట్ల విలువ చేసే 27.98 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రైతాంగం నకిలీ విత్తనాల బారిన పడకుండా జిల్లా వ్యవసాయ శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే రైతులు పత్తి విత్తనాలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కొందరు వ్యక్తులు గ్రామాల్లో హెచ్టీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండడంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినా.. గుట్టుచప్పుడు కాకుండా దందా సాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధిక ధరకు పత్తి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. రైతులు విత్తనాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి. గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాలి. ఈ నెల 27 నుంచి గ్రామాల వారీగా రైతులకు ఏఈవోలు అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా ఏ రకం విత్తనాలతో సాగు చేసిన దిగుబడి ఒకే రకంగా వస్తుంది. కొన్ని పత్తి విత్తనాల రకాలపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు.
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి