కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. రెండేండ్ల కిందట దేశమే అతలాకుతలమైన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్లో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అదే వైరస్ రూపాంతరం చెంది కొత్తకొత్త వేరియంట్లుగా పరిణతి చెందుతున్నది. ప్రస్తుతం జేఎన్ 1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నది. కరోనా బారినపడకుండా ఉండాలంటే అప్రమత్తతే ఆయుధమని వైద్యులు పేర్కొంటున్నారు. మాస్క్లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవాలని
పేర్కొంటున్నారు.
యాలాల, డిసెంబర్ 27 : కరోనా మహమ్మారి మరోసారి వేగంగా వ్యాపిస్తున్నది. ఈ మధ్య కాలంలో కేరళలో బయటపడ్డ కొత్త వేరియంట్ జేఎన్ 1 జెట్ స్పీడ్తో దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడంతో వ్యాప్తి పెరుగుదలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. చిన్నారులు సైతం ఈ కరోనా బారినుంచి తప్పించుకోలేకపోతున్నారు. కరోనాతో కేరళలో ఒకరు మృతి చెందారు. మూడు రోజుల కింద 14 నెలల చిన్నారికి కొవిడ్ నిర్ధారణ జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా నిలోఫర్లో మరో కేసు నమోదైంది. జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలతో దవాఖాన చికిత్స పొందుతున్న 51 మంది రక్త నమూనాలను కొవిడ్ పరీక్షలకు పంపగా ఆరు నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చింది. చిన్నారికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం క్రమంగా కుదుట పడి కోలుకుంటుందని వైద్యులు పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1 కరోనా కేసులతో కలుపుకొని తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరిందని తెలంగాణ డీహెచ్ రవీంద్ర నాయక్ ఓ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ జేఎన్1 కేసులు నమోదు కాలేదని తెలిపారు.
భారత్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు) 116 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగడంతో ఆయా రాష్ర్టాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశంలో కొత్తగా నమోదైన కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరింది. ఇక అత్యధికంగా కేరళలో 3,128 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 344 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 34 మందికి తాజాగా జేఎన్ 1 వేరియంట్ సోకగా, ముగ్గురు మృతి చెందారు.
కరోనా తెలుగు రాష్ర్టాల్లో కూడా విస్తరిస్తున్నది. 24 గంటల్లో తెలంగాణలో 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 29 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన రెండు రోజుల్లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోనే 4 పాజిటివ్ కేసులు నమోదవడంతో జిల్లా దవాఖానలో కరోనా స్పెషల్ వార్డును ఏర్పాటు చేశారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి వైరస్ సోకడంతో… హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
రెండు సంవత్సరాల కింద కరోనా పేరు వింటేనే మనలో ఏదో అలజడి. పోయిన ప్రాణాలకు లెక్కేలేదు. అనంతరం రూపాన్ని, స్వభావాన్ని మార్చుకొన్నా వైరస్ 2021లో ఒమిక్రాన్ రూపంలో, ఉపవేరియంట్లుగా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. కరోనా ఉపవేరియంట్ అయిన ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన బీఏ 2.86 నుంచి వచ్చిన మరో ఉపవేరియంట్ జేఎన్ 1 ప్రస్తుతం దేశంలో అలజడి సృష్టిస్తుంది. చాపకింద నీరులా వ్యాపిస్తుంది. జేఎన్1 ను మొదట ప్రాన్స్లో, అనంతరం అమెరికాలో గుర్తించారు. మన భారత్లో దీని ప్రభావం మధ్యస్తం అని చెప్పుకోవచ్చు. జేఎన్ 1 వైరస్కు గ్రోత్, ఎస్కేప్ శక్తి ఎక్కువ. అంటే వేగంగా వ్యాపించే స్వభావంతో పాటు యాంటీబాడీస్ను, రోగ నిరోదక శక్తిని అధిగమించే శక్తి కొంత ఎక్కువగానే ఉన్నాయి. జేఎన్1 అనేది బీఏ 2.86కు ఉపవేరియంట్ కావడంతో.. దీన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులో నిర్ధారించలేం. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిందే.
గతంలో వైరస్కు సంబంధించి హైరిస్క్ 50 శాతానికి పైగా ఉండేది. ఇప్పడు అది 6 శాతానికి పడిపోయింది. మిడిల్ రిస్క్ 3 శాతం, లోయర్ రిస్క్ 0.5 శాతంగా ఉన్నది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అవయవ మార్పిడి చేయించుకొన్న వాళ్లు, ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధ పడుతున్నవారు హైరిస్క్లో ఉన్నరన్న విషయాన్ని గుర్తించుకోవాలి. వీరు మరింత జాగ్రత్తగా ఉండడమే కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన చికిత్స చేయించుకోవాలి. జేఎన్1 విషయంలో పిల్లలు లో రిస్క్ పరిధిలోనే ఉన్నప్పటికీ శ్వాసకోశ సమస్యలు, గుండె రుగ్మతలు ఉన్న పిల్లలూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రస్తుతం నమోదవుతున్న జేఎన్1 కరోనా వేరియంట్లో సాధారణ జలుబు, ముక్కు కారడం, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, తలనొప్పి, నీరసం, కడుపునొప్పి, కళ్లు ఎర్రబడటం వంటి సీజనల్ లక్షణాలే కనిపిస్తుంటాయి. అందువల్ల ఈ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ఆరోగ్య సలహాలు,
జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలుంటే జాగ్రత్తగా ఉండాలి. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే దవాఖానకు వెళ్లాలి. జన సాంధ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్కు వాడితే మంచిది. భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.