Ananthagiri Hills | వికారాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రదేశంగా కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో డీపీఆర్ను తయారు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. 213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. వీటిలో 177 ఎకరాల్లో ఎకో టూరిజంతో పాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్, రిసార్టు, కాటేజెస్, ఆంపి థియేటర్, పర్యాటకులను ఆకర్శించేందుకు అటవీ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, శారీరక దృఢత్వానికి యోగా కేంద్రం, ధ్యాన కేంద్రం, స్పా, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు.
అనంతగిరి అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్ల నిర్మాణం, ట్రెక్కింగ్ ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతాన్ని పూర్తిగా వీక్షించేందుకు రోప్వేను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో 36 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతోపాటు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు.
అలాగే అనంతగిరి హిల్స్లోని అనంతపద్మనాభ స్వామి ఆలయం చుట్టూ సుందరీకరణతోపాటు పార్కింగ్ ఏరియా, లైటింగ్, ఫంక్షన్ హాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేయనున్నారు. అనంతగిరితోపాటు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయనున్నారు. కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లో కాటేజీలతోపాటు రెస్టారెంట్లు, బోటింగ్, స్పీడ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, ఆంపి థియేటర్, రిసెప్షన్, ఆర్చ్లను ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్తోపాటు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లో టూరిజం అభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రూ.118 కోట్లను ఖర్చు చేయనున్నాయి.
జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేశారు. డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)ను ఇప్పటికే ఎల్ఎండ్టీ సంస్థ సిద్ధం చేయడంతో వారంలోగా కేంద్రానికి డీపీఆర్ను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. చిన్న, చిన్న మార్పులు చేయాలని కలెక్టర్ సూచించడంతో రెండు రోజుల్లో డీపీఆర్లో మార్పులు పూర్తి చేసి కేంద్రానికి అందజేసేలా చర్యలు చేపట్టారు. డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపిన అనంతరం టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. 3,600 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతంలోని 213 ఎకరాల్లో ఎకో టూరిజం స్పాట్గా అభివృద్ధిలోకి తీసుకురానున్నారు.
హైదరాబాద్ నగరానికి సమీపంలో అనంతగిరి హిల్స్ ఉండడంతో వారాంతంలో అనంతగిరి హిల్స్లో పర్యాటకులు అధిక సంఖ్యలో సందడి చేస్తున్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకుల తాకిడికి సరిపోను సౌకర్యాలు ఎక్కడా లేకపోవడంతో వారిని మరింత ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్గా సరికొత్తగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతంగా చేస్తున్నారు. స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి హిల్స్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఎంపిక చేశాయి. రెండేండ్లలోగా అనంతగిరి హిల్స్, కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు.
తెలంగాణ ఊటీగా పిలిచే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సెలవులు వస్తే చాలు నగరవాసులు అనంతగిరిలో వాలిపోతున్నారు. ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లో 4వేల నుంచి 5వేల మంది వరకు పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో వారాంతపు సెలవుల్లో అనంతగిరి పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. అనంతగిరిలోని ప్రసిద్ధ పద్మనాభస్వామిని దర్శించుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్లను చూసేందుకు, ట్రెక్కింగ్ చేసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. కేరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ పాల్స్ వద్ద పర్యాటకులు సేద తీరుతున్నారు.
అనంతగిరి అడవుల్లోని వాతావరణంలో సేద తీరేందుకు చాలా మంది పర్యాటకులు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా వస్తుంటారు. అనంతగిరికా హవా.. లాకో రోగోంకా ధవా (అనంతగిరి గాలి లక్ష రోగాలకు మందు) అని నానుడి ఉన్నది. అనంతగిరి అటవీ ప్రాంతాల్లోని ఔషధ మొక్కలతో రోగాలు నయమవుతుంటాయన్న నమ్మకంతో చాలా మంది పర్యాటకులు అనంతగిరి కొండకు క్యూ కడుతున్నారు. మరోవైపు అనంతగిరి అడవుల్లో జింకలతోపాటు వందల రకాల పక్షులు, నిశాచర జంతువులతోపాటు వివిధ రకాల సీతాకోక చిలుకలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
అనంతగిరి ఎకో టూరిజం అభివృద్ధి పనులకు సంబంధించి ఫిబ్రవరి చివరి వారంలోగా టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డీపీఆర్ను దాదాపు పూర్తి చేశాం. వారం రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ను అందజేసేందుకు కసరత్తు చేస్తున్నాం. అనంతపద్మనాభ ఆలయాభివృద్ధి, సర్పన్పల్లి, కోట్పల్లి ప్రాజెక్టులు పర్యాటకంగా అభివృద్ధిలోకి రానున్నాయి.
– సి.నారాయణ రెడ్డి, కలెక్టర్, వికారాబాద్ జిల్లా