సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) ; రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి గ్రేటర్ హైదరాబాద్లో 2014లో 2261 మెగావాట్లుగా ఉన్న పీక్ అవర్ డిమాండ్ నేడు 3756 మెగావాట్లకు చేరుకోగా, గరిష్ట వినియోగం 49.56 మిలియన్ యూనిట్ల నుంచి 80 మిలియన్ యూనిట్లకు చేరింది. 2014లో గ్రేటర్ పరిధిలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు 38లక్షలు ఉంటే గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో మొత్తం కనెక్షన్లు 60లక్షలకు చేరాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గ్రేటర్ పరిధిలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 9 సర్కిళ్లను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తొమ్మిదిన్నర ఏండ్లలో విద్యుత్ సంస్థ పరిధిలో పంపిణీ వ్యవస్థ మెరుగుకు రూ. 14,063 కోట్లు వెచ్చిస్తే, అందులో రూ.10 వేల కోట్లను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్ల పరిధిలోనే ఖర్చు చేశారు. – సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)
సోలార్ విద్యుత్ ఉత్పత్తి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 3వేల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నగరవాసులు తమ నివాసాలపై ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ప్రతి రోజు సుమారు 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
ఐటీ కారిడార్లో 33 కేవీ స్విచ్చింగ్ స్టేషన్..
నగరంలో ఉన్న ఐటీ కంపెనీల్లో 80 శాతం కంపెనీలు వెస్ట్జోన్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో వెస్ట్జోన్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్లో మెరుగైన విద్యుత్ సరఫరాకు మాదాపూర్లోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో రూ.8 కోట్ల వ్యయంతో 33 కేవీ స్విచ్చింగ్ స్టేషన్ను ప్రారంభించారు. దీంతో ఐటీ కారిడార్లో కొత్తగా ఎన్ని కంపెనీలు వచ్చినా నిరంతరరాయంగా విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.
మహానగరం ఔటర్ రింగురోడ్డు దాటి శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో విద్యుత్ శాఖలో విద్యుత్ డిమాండు పెరుగుదల శాతం ప్రతియేటా 8 శాతం ఉండగా, కోర్ సిటీతో పోల్చితే శివార్ల ప్రాంతాల్లో 15- 20 శాతం డిమాండ్ పెరుగుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు లోపల జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే కొత్తగా ఏర్పాటైన 7 మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు 14 మునిసిపాలిటీల్లో కొత్తగా ఎక్కువ మొత్తంలో నివాసాలు ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా నగర విస్తరణ ఉంటోందని, ఈ ప్రాంతాల్లోంచే కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
విద్యుత్ శాఖలో ఆన్లైన్ సేవలు
గ్రేటర్ పరిధిలో 9 సర్కిల్ కార్యాలయాలు ఉండగా, వాటి పరిధిలోని సెక్షన్ కార్యాలయాల్లో కస్టమర్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారులు విద్యుత్ కార్యాలయాలకు రాకుండానే అరచేతిలోని స్మార్ట్ఫోన్లోనే అవసరమైన విద్యుత్ సేవలను పొందుతున్నారు. ఇప్పటికే విద్యుత్ బిల్లుల చెల్లింపులు 60 శాతానికి కంటే ఎక్కువ మంది ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. విద్యుత్ ఫిర్యాదుల కోసం 1912 నంబర్కు ఫోన్ చేస్తే ఒకసారి 20 లైన్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒకేసారి 300 కాల్స్ వచ్చినా తీసుకునే ఏర్పాట్లు చేయడంతో పాటు ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా ప్రతికాల్ను నమోదు చేసేలా వ్యవస్థను రూపొందించారు.
గ్రేటర్లో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్లు