సమైక్య రాష్ట్రంలో ఇరుకు, గతుకుల రోడ్లు, వాగులు, కాలువలపై వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ, తెలంగాణ సర్కార్ మారుమూల గ్రామానికి సైతం మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది. వేల కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ చేపట్టింది. దీంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది. తొమ్మిదిన్నరేండ్లలో జిల్లాలో 2,270 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించింది. ఇందుకోసం ఆర్అండ్బీ శాఖ రూ.1,027 కోట్లు, పంచాయతీరాజ్శాఖ నుంచి రూ. వెయ్యికోట్లను వెచ్చించింది.
-రంగారెడ్డి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో ఏ రోడ్డు మీద ప్రయాణమైనా నరకయాతన ఉండేది. అడుగడుగునా గుంతలు.. తారులేచిన రోడ్లు.. సింగిల్ రోడ్లతో నిత్యం ప్రమాదాలు.. ఎక్కడకు వెళ్లాలన్నా గంటల కొద్దీ ప్రయాణం తప్పని సరి అయ్యేది. స్వరాష్ట్రంలో రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. పల్లెపల్లెకూ బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. సింగిల్ రోడ్లు సైతం డబుల్, ఫోర్ లేన్లుగా రూపాంతరం చెందాయి. ఫలితంగా జర్నీ సాఫీగా సాగుతున్నది. లింక్ రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఒకప్పటి వెతలు తీరాయి. జిల్లాలో గత తొమ్మిదేండ్లలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.1,027కోట్ల వ్యయం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన రోడ్ల నిర్మాణాలతో మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
ఏండ్లనాటి ‘దారి’ద్య్రం తొలగిపోయింది. ఏండ్ల తరబడి గతుకులు, అతుకుల దారులతో పడ్డ కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం చరమగీతం పాడింది. సీఎం కేసీఆర్ ఇబ్బడిముబ్బడిగా రోడ్లు అభివృద్ధ్దికి నిధులు కేటాయించి ఉమ్మడి రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలకు పట్టిన శనిని వదిలించారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.1,027 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.వెయ్యికి పైగా కోట్లను వెచ్చించి జిల్లావ్యాప్తంగా 2,270కి.మీ మేర రోడ్లను నిర్మించారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లతోపాటు గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి విస్తారంగా రోడ్లను నిర్మించారు. అవసరమైన చోట వంతెనలను నిర్మించారు. దీంతో పల్లె నుంచి పట్నం దాకా రవాణా సౌకర్యం మెరుగుపడింది. ప్రయాణానికి ఎక్కడా ఆటంకాలు కలుగకుండా, వాహనాలు మైలేజీ ఎక్కువ వచ్చేలా రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాల స్పీడ్ మెరుగుపడడంతోపాటు వృథా సమయం తగ్గింది. మెరుగైన రవాణా వ్యవస్థతో పరిశ్రమలతోపాటు అన్ని రంగాలకు తోడ్పాటు లభిస్తున్నది.
గతంలో రోడ్లతో చాలా ఇబ్బందులు ఉండేవి. రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించారు. రోడ్ల నిర్మాణం చేపట్టారు. కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం, రోడ్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయించారు. కేసీఆర్ది ప్రజా రంజక పరిపాలన అని చెప్పొచ్చు.
– మంగళి మాధవి, దేవునిఎర్రవల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లకు మహర్దశ ఏర్పడింది. గతంలో గ్రామాలు, తండాలకు రోడ్లు ఉండేవి కావు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామం, తండాకు బీటీ రోడ్లను నిర్మించింది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రహదారులను బాగు చేయడం వల్ల రవాణా వ్యవస్థను చక్కదిద్దారు.
– రవినాయక్, సర్పంచ్, గోగ్యనాయక్ తండా (కులకచర్ల)
సీఎం కేసీఆర్ హయాంలో ప్రతి పల్లెకు రోడ్డు వేయడంతో పాటు పట్టణాలకు లింక్ రోడ్లను నిర్మించారు. దీంతో ఏ అవసరమొచ్చినా తక్కువ సమయంలోనే పట్టణాలకు వెళ్లి పని చూసుకుని తిరిగి వచ్చే వెసులుబాలు కలిగింది. శంకర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోకి రోడ్లను నిర్మించారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నా.
– గోవర్ధన్రెడ్డి, ప్రొద్దటూర్ గ్రామం (శంకర్పల్లి)
సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు, తండాలకు వెళ్లే రహదారులు బాగుపడ్డాయి. గతంలో గుంతలమయంగా మట్టి రోడ్లు ఉండేవి. వానకాలం వచ్చిదంటే బాధలు వర్ణనాతీతం. స్వరాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సార్ సీఎం అయ్యాక మట్టి రోడ్లన్నీ బీటీ రోడ్లుగా మారిపోయాయి. గ్రామాలు, తండాల నుంచి మండల కేంద్రాలకు రోడ్లను నిర్మించారు. దీంతో భూములకు సైతం విలువ పెరిగింది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– శ్రీనునాయక్, ఉప సర్పంచ్, కొండ్రిగానిబోడుతండా(కడ్తాల్)
ఉమ్మడి రాష్ట్రంలో పల్లెకు తొవ్వలు సరిగా ఉండేవికావు. ఉన్న మట్టి రోజు గుంతలమయంగా ఉండేది. వానకాలం వచ్చిందంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సిందే. బురద రోడ్డులో పడి కాళ్లు, చేతులు విరగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. రాష్ట్రం వచ్చాకే సీఎం కేసీఆర్ పాలనలో రోడ్లు బాగుపడ్డాయి. ప్రస్తుతం రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేదు. పల్లెలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టే మళ్లీ అధికారంలోకి రావాలి.
– వెంకటేశ్, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్(చేవెళ్లటౌన్)
వికారాబాద్ నుంచి పరిగి వెళ్లే రోడ్డు డబుల్ రోడ్డు కావడంతో వాహన దారులకు మార్గం సుగమమైంది. వికారాబాద్ నుంచి బుగ్గరామలింగేశ్వరాలయం వరకు డబుల్ రోడ్డు చేశారు. మోమిన్పేట, హైదరాబాద్, తాండూరు రోడ్లకు మరమ్మతు పనులు చేశారు. వికారాబాద్ బంగారు మైసమ్మ ఆలయం నుంచి నవాబుపేట వరకు డబుల్ రోడ్డు ఏర్పాటైంది. గతంలో ఇబ్బందులు పడిన వాహనదారులకు తిప్పలు తప్పాయి. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– డి.గోపాల్, రామయ్యగూడ (వికారాబాద్)
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రతి తండాకు తారురోడ్డును నిర్మించారు. గతంలో వేరే గ్రామానికి వెళ్లాలన్నా, టౌన్కు వెళ్లి వద్దామన్నా నానా అవస్థలు పడేవాళ్లం. సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేశారు. చిన్న చిన్న వీధుల్లోనూ చక్కని సీసీ రోడ్లను వేయించి మా కష్టాలను దూరం చేశారు. గతంలో గుంతల రోడ్లు, చిన్న వర్షానికే బురదగా మారి ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.
– ముడావత్ సీతారాం, గ్రామం పెర్కంపల్లి తండా(యాలాల)
ఏండ్ల కాలంగా మా తండాకు రోడ్డు సమస్య ఉండేది. పోచమ్మతండా వరకు ఎమ్మెల్యే సహకారంతో బీటీ రోడ్డు నిర్మించారు. గ్రామంలోని రెండు తండాల మధ్య వాగు ఉన్నది. వర్షాకాలం వాగు ప్రవహిస్తే ఎక్కడి వారు అక్కడే ఉండేది. వృద్ధురాలు చనిపోతే వాగు దాటే పరిస్థితి లేక రెండు రోజులు ఇంట్లోనే పెట్టుకొన్నాం. పశువులు, వ్యక్తులు వాగులో కొట్టుకుపోయారు. బ్రిడ్జి, రోడ్డు నిర్మాణాలతో రవాణా సౌకర్యం ఏర్పడింది. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే నరేందర్రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– శంకర్నాయక్, పోచమ్మతండా (కొడంగల్)