ఇబ్రహీంపట్నం, జనవరి 18 : మామిడికాయల సీజన్ నేపథ్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందిలేకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి ఎక్కువగా రానున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న షెడ్లకు తోడు అదనంగా మరో ఆరు షెడ్ల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. గత సంవత్సరం కోహెడ పండ్ల మార్కెట్కు 88 మెట్రిక్ టన్నుల మామిడికాయలు వచ్చాయి. ఉద్యానవనశాఖ అధికారుల సమాచారం మేరకు ఈ సంవత్సరం లక్షకుపైగా మెట్రిక్ టన్నుల మామిడికాయలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం బాటసింగారం పండ్ల మార్కెట్లో ఆరు షెడ్లు ఉన్నాయి. ఈ ఆరు షెడ్లలో మార్కెట్కు వచ్చే అన్ని రకాల పండ్ల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. అధికారులు మరో 12 ఎకరాల్లో కొత్తగా ఆరు షెడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీనికితోడు అవసరమైతే తాత్కాలిక షెడ్ల కోసం మరో ఐదెకరాలను తీసుకున్నారు. మార్కెట్కు వచ్చే వాహనాల కోసం ఐదెకరాల పార్కింగ్ను కూడా ఏర్పాటు చేశారు.
బాటసింగారం మార్కెట్లోనే క్రయవిక్రయాలు
మరోవైపు బాటసింగారం పండ్ల మార్కెట్ను కాదని, అనధికారికంగా పహాడీషరీఫ్ ప్రాంతంలో కొంతమంది వ్యాపారస్తులు ప్రత్యామ్నాయంగా క్రయవిక్రయాలు జరుపడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్కెటింగ్శాఖ అధికారులు బాటసింగారం పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలకు సంబంధించి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. పహాడీషరీఫ్ సమీపంలో అనధికారికంగా కొంతమంది వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన మార్కెట్ వలన వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనముండదని, కొంతమంది వ్యాపారులు తమ ప్రయోజనాల కోసమే ఏర్పాటు చేశారని, దానికెలాంటి లైసెన్స్ కూడా లేదని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. దీంతో అక్కడికి వెళ్లడానికి వ్యాపారులెవరూ ముందుకు రావటంలేదు. బాటసింగారం పండ్ల మార్కెట్లోనే క్రయవిక్రయాలు జరుపుతామని వ్యాపారస్తులంతా ముందుకొస్తున్నారు.
ప్రత్యేక కోల్డ్ స్టోరేజీలు
మామిడికాయల సీజన్లో పండ్లు, కాయల నిల్వకోసం ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేశారు. పండ్ల మార్కెట్ పరిధిలో 21 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. మామిడి సీజన్లో అవసరమైతే మరిన్ని కోల్డ్ స్టోరేజీలను లీజ్కు కూడా తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. రైతులు, వ్యాపారులు విశ్రాంతి తీసుకునేందుకు గదుల సౌకర్యాన్ని కూడా కల్పించారు.
ప్రతిరోజూ 150 నుంచి 200 వాహనాలు
ప్రస్తుతం బాటసింగారం పండ్ల మార్కెట్కు ప్రతిరోజూ 150 నుంచి 200 వరకు వాహనాల్లో అనేక రకాల పండ్లు వస్తున్నాయి. దీంతో పండ్ల మార్కెట్ క్రయవిక్రయదారులతో బిజీ అయ్యింది. ప్రస్తుతం పండ్ల మార్కెట్కు జామ, బత్తాయి, దానిమ్మ, ఆపిల్, ద్రాక్ష, పుచ్చకాయలు, బొప్పాయి వంటి పండ్లు వస్తున్నాయి. గతం కంటే పండ్ల వ్యాపారం రెట్టింపయ్యింది. దీంతో మార్కెట్ ఆదాయం పెరగడంతోపాటు వ్యాపారులు కూడా స్వేచ్ఛగా క్రయవిక్రయాలు జరుపుకొంటున్నారు. ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తుల్లో పూర్తిస్థాయి భరోసా నింపడంలో మార్కెటింగ్ అధికారులు సఫలమయ్యారు.
నేటి నుంచి స్థలాల కేటాయింపు
బాటసింగారం పండ్ల మార్కెట్లో మామిడికాయల విక్రయాల కోసం అదనంగా నిర్మించిన షెడ్లల్లో గురువారం నుంచి స్థలాల కేటాయింపు జరుపనున్నారు. గత సంవత్సరం జరిపిన క్రయవిక్రయాల ప్రక్రియను ఆధారంగా తీసుకుని ఈ సంవత్సరం స్థలాల కేటాయింపు చేపడుతున్నారు. మామిడికాయల విక్రయం కోసం ఇప్పటికే 80 మంది వ్యాపారస్తులు స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా మరో 180 మంది దరఖాస్తు చేసుకునే అవకాశముంది. దరఖాస్తులు చేసుకున్నవారందరికీ కొత్తగా నిర్మించిన షెడ్లల్లో స్థలాలను కేటాయించనున్నారు. స్థలాలు సరిపోకపోతే తాత్కాలికంగా ఏర్పాటు చేసే షెడ్లల్లో మిగతావారందరికీ స్థలాలను కేటాయించనున్నారు. మార్కెట్కు ప్రతిరోజూ 300 నుంచి 400 వరకు వాహనాలు వచ్చే అవకాశమున్నందున ఐదెకరాల్లో పార్కింగ్, మామిడికాయల దిగుబడి అధికం కానుండటంతో ప్రత్యేకంగా ధర్మకాంటలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా బాటసింగారం పండ్ల మార్కెట్కు మామిడికాయలు రానున్నందున మార్కెటింగ్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
బాటసింగారం పండ్ల మార్కెట్లోనే క్రయవిక్రయాలు జరుపుకోవాలి : నర్సింహారెడ్డి, కార్యదర్శి
బాటసింగారం పండ్ల మార్కెట్ మార్కెటింగ్ అధికారుల ఆజమాయిషీలో కొనసాగుతున్నందున క్రయవిక్రయదారులు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. ఇతర చోట్ల క్రయవిక్రయాలు జరిపితే ఎవరి ఆజమాయిషీ లేకపోవడంతో వ్యాపారులు నష్టపోయే అవకాశముంది. మార్కెట్లో అన్ని రకాల అదనపు సౌకర్యాలు కల్పించాం. వ్యాపారులు ఎలాంటి మోసాలకు తావులేకుండా తమ విక్రయాలు జరుపుకోవచ్చు. ప్రభుత్వం ప్రత్యేకించి పండ్ల క్రయవిక్రయాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది.
మార్కెట్లో అన్ని సౌకర్యాలున్నాయి
– హాజీఅలీ, వ్యాపారి
పండ్ల మార్కెట్లో క్రయవిక్రయాలు జరుపుకోవడానికి అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇది వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వేచ్ఛగా ఎలాంటి మోసాలకు తావులేకుండా ఇక్కడ క్రయవిక్రయాలు జరుపుకొంటున్నాం. మామిడి సీజన్ను దృష్టిలో ఉంచుకుని అదనపు షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. వ్యాపారులంతా ఇక్కడే తమ క్రయవిక్రయాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
కమీషన్దారులకు మరిన్ని వసతులు కల్పించాలి
– స్వామి, వ్యాపారి
క్రయవిక్రయదారులు కూర్చుని డబ్బులు పంచుకోవడానికి ప్రత్యేక భవనాన్ని కేటాయించాలి. ప్రస్తుతం రోడ్లపైనే వ్యాపారులు, రైతులకు మధ్య డబ్బుల పంపిణీ జరుగుతున్నది. ప్రత్యేక భవనం కేటాయిస్తే అందులోనే డబ్బుల పంపిణీతో పాటు విశ్రాంతి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.