కడ్తాల్, అక్టోబర్ 5: కడ్తాల్ మండలం దినదినాభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 2016లో కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. అంతకుముందు ఆమనగల్లు మండలంలో ఉన్న కడ్తాల్ గ్రామాన్ని ప్రభుత్వం కడ్తాల్ మండల కేంద్రంగా ప్రకటించింది. ఆమనగల్లు మండలం నుంచి 8 గ్రామాలు, తలకొండపల్లి మండలంలోని 4 గ్రామాలతో కడ్తాల్ నూతన మండలంగా ఏర్పాటైంది. అనంతరం ప్రభుత్వం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో 24 గ్రామ పంచాయతీలుగా మండలం కొనసాగుతున్నది. మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ భవనం లేకపోవడంతో రైతు భవనంలో అరకొర సౌకర్యాలతో పోలీస్స్టేషన్ కార్యాకలాపాలు నడిచాయి.
రూ.1.50 కోట్లతో భవన నిర్మాణం..
మండల కేంద్రంలో నూతన భవనానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు స్థానిక ప్రజాప్రతినిధులు విన్నవించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల కేంద్రంలో పోలీస్స్టేషన్ భవనాన్ని నిర్మించేందుకు, కడ్తాల్ పట్టణంలోని ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఎండీ శేషగిరిరావు సీఎస్ఆర్ నిధులు రూ.1.50 కోట్లతో భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వం 30 గుంటల భూమిని కేటాయించింది. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగాయి.
సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ హరిశంకర్గౌడ్, గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన ఉపేందర్ భవన నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించారు. పోలీస్స్టేషన్ సరికొత్త హంగులతో, సీఐ, ఎస్ఐకి ప్రత్యేక గదులు, కంప్యూటర్ రికార్డులు, వాహనాల పార్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, విశ్రాంతి, కౌన్సిలింగ్, వెయిటింగ్, రైటర్స్ గదులు, నిందితులకు ప్రత్యేక లాకప్లు, రిసెప్షన్, అన్ని రకాల వసతులు, సదుపాయాలతో పోలీస్స్టేషన్ నిర్మాణం పూర్తయ్యింది.
మండలానికి కొత్తశోభ
మండల కేంద్రంలో చేపట్టిన పోలీస్స్టేషన్ భవనం అన్ని రకాల సౌకర్యాలు, అత్యాధునిక హంగులతో పూర్తయ్యింది. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆదేశాల మేరకు శనివారం భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. పోలీస్స్టేషన్ ప్రారంభంతో కడ్తాల్ మండలానికి కొత్తశోభ సంతరించుకోనున్నది. పోలీస్స్టేషన్ ప్రారంభోత్సవానికి హోం శాఖ మంత్రి మహమూద్అలీ, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్వ్రీంద్ర, డీసీపీ నారాయణరెడ్డి, ఏసీపీ రంగస్వామి హాజరుకానున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి..
మండల కేంద్రంలో సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సూచనలు, సలహాల మేరకు పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యాయి. భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యేతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. సరికొత్తగా నిర్మించిన పోలీస్స్టేషన్ భవనంతో కడ్తాల్కి కొత్త శోభ సంతరించుకోనున్నది. శనివారం పోలీస్స్టేషన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
-హరిశంకర్గౌడ్, ఎస్ఐ, కడ్తాల్ మండలం.