తుర్కయంజాల్ : రైతుల సంక్షేమమే ధ్వేయంగా ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులను చేపడుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడలో తుర్కయంజాల్ రైతుసేవా సహకార సంఘానికి ఇటీవల ప్రభుత్వం కేటాయించిన గోదాముల నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భముగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్లో రైతులకు అన్ని రకాలుగా ఉపయోపడే విధంగా తుర్కయంజాల్ రైతుసేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.25కోట్ల నుంచి రూ.30కోట్లతో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్లో కొహెడలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో గోదాములతో పాటుగా కోల్డ్ స్టోరేజిల నిర్మాణం సైతం చేపడుతామని, ఇందులో రైతులు వారికి అవసరమైన వాటిని స్టోర్ చేసుకోవచ్చన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య జిల్లా రైతుబంధు సమితి కో ఆర్డీనేటర్ వంగేటి లక్ష్మారెడ్డి,డీసీఓ ధాత్రిదేవి,ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.