యాచారం, మే18: రంగారెడ్డి జిల్లా యాచారం (Yacharam) మండలంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్ద పీఠవేసిన విషయం తెలిసిందే. పట్టణ రోడ్లను తలపించేలా గ్రామీణ రోడ్లు, లింకురోడ్ల అభివృద్ధికి గత బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల రోడ్లు మీర్ఖాన్పేట నుంచి యాచారం వరకు నాలుగు లైన్ల రోడ్డుకు రూ.48కోట్లు, నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు 100 ఫీట్ల రోడ్డుకు రూ.29 కోట్ల నిధులను గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా కందుకూరు నుంచి యాచారం వరకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రధాన రహాదారులను కలిపేలా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. నందివనపర్తి నుంచి మేడిపల్లి వరకు ఫార్మాసిటీకి వేళ్లేందుకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. 14 కిలోమీటర్ల మేర రెండు రోడ్ల నిర్మాణానికి ఏకంగా రూ.77కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఇందులో కందుకూరు నుంచి మీర్ఖాన్పేట వరకు డబుల్ రోడ్డు నిర్మాణం గత బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యింది. ఔటర్ రింగ్రోడ్డును తలపించేలా రోడ్డు నిర్మాణం పూర్తయినప్పటికీ మీర్ఖాన్పేట నుంచి యాచారం వరకు నిర్మించే రోడ్డు నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో రోడ్డు గత కొన్ని నెలలుగా నిర్మాణ దశలోనే నిలిచి పోయింది. అటూ నందివనపర్తి-మేడిపల్లి రోడ్డు నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణానికే పరిమితమైంది. ఈ రోడ్లకు మోక్షమెప్పుడో వేచి చూడాల్సందే మరీ.
మీర్ఖాన్పేట-యాచారం రోడ్డుకు గ్రహనం
కందుకూరు మండలం మీర్ఖాన్పేట మైసమ్మ గుడి నుంచి నజ్దిక్ సింగారం, నందివనపర్తి మీదుగా యాచారం వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును డబుల్రోడ్డుగా విస్తరించేందుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు సైతం మంజూరు చేసింది. రూ.48కోట్ల నిధులతో చేపట్టిన మీర్ఖాన్పేట-యాచారం రోడ్డు పనులు మొదట్లో సాఫీగానే సాగాయి. రోడ్డు వెడల్పు పనులను వేగవంతంగా చేశారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, రాళ్లు తొలగించారు. రోడ్డు చదును చేసి వెడల్పు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో ఆ రోడ్డు పనులు ఒక్కసారిగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రోడ్డు వెడల్పులో భాగంగా ఉన్న బీటీ రోడ్డును తొలగించి చదును చేయడంతో మట్టి రోడ్డుగా మారింది. వర్షాలకు రోడ్డు మట్టి కొట్టుకుపోయి ఒక్కసారిగా దుమ్ము లేస్తున్నది. దీంతో ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రయాణికులు దుమ్ము దూళితో నరకం చవిచూస్తున్నారు. వర్షానికి గంతలలో నీరు నిలవడంతో వాహనదారులు ఒక్క సారిగా జంకుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనదారులు సైతం అవస్థలు పడుతున్నారు. యాచారం నుంచి కందుకూరు త్వరగా చేరుకునే ప్రయాణికులు రోడ్డు అద్వాన్నంగా ఉండటంతో గమ్యస్థానానికి సకాలంలో చేరుకోలేక పోతున్నట్లు వాపోతున్నారు. అప్పుడప్పడు వాహనాలు అదుపుత తప్పి కింద పడటంతో తీవ్రగాయాల పాలవుతున్నారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి అర్ధాంతరంగా నిలిచిన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
బ్రిడ్జి నిర్మాణాలకే పరిమితమైన నందివనపర్తి-మేడిపల్లి రోడ్డు
నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటి వరకు రూ. 29కోట్లతో 100ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును 100ఫీట్ల రోడ్డుగా విస్తరించేందుకు సంకల్పించింది. రోడ్డు వెడల్పు పనులను సైతం ప్రారంబించారు. అయితే రోడ్డు మార్గంలో ఉన్న రెండు చిన్న కల్వర్టులను పెద్ద బ్రిడ్జిలుగా నిర్మించి వదిలేశారు. ఈ రోడ్డు సైతం బ్రిడ్జిల నిర్మాణానికే పరిమితమైంది. రోడ్డు నిర్మాణం సైతం మధ్యాంతరంగా నిలిచిపోవడంతో బ్రిడ్జిల వద్ద ప్రయాణికులు వాహనదారులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనం కనిపించకపోవడం, వర్షం కురిస్తే అక్కడ ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి చిన్న కుంటలను తలపించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే నందివనపర్తి, మేడిపల్లి, బొల్లిగుట్టతండా, కొమ్మోనిబావి, గంటోనిబావి గ్రామాలకు చెందిన ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు బావిస్తున్నారు. నందివనపర్తి-మేడిపల్లి లింకు రోడ్డుకు మోక్షమెప్పుడోనని ప్రయాణికులు ఎదురు సైతం ఎదురు చూస్తున్నారు. రోడ్డును త్వరితగతిన పూర్తిచేయాలని నందివనపర్తి, మేడిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
పనుల నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్
రోడ్డు నిర్మాణానికి సకాలంలో సరిపడా బిల్లులు రాకపోవడంతో రోడ్డు నిర్మాణానికి టెండర్ వేసిన కాంట్రాక్టర్ పనుల నుంచి తప్పించుకున్నాడు. అతనికి సుమారు రూ. 20కోట్లు బిల్లులు పెండింగ్లో ఉండటంతో అతను పనుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో మరే కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. దీంతో ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. రోడ్డుపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
డబుల్రోడ్డు పనులను పూర్తి చేయాలి..
యాచారం నుంచి మీర్ఖాన్పేట వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్త్యావత్ రాజునాయక్ డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రోడ్డు విస్తరణ పనులు మద్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, దూళి, అడుగడుగున గుంతలతో నిత్యం వాహనదారులు నరకం చూస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, సంబదదిత అధికారులు ఈరోడ్డుపై దృష్టి సారించాలి. గత ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది. అదే అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి.
నందివనపర్తి-మేడిపల్లి రోడ్డును నిర్మించాలి
నందివనపర్తి నుంచి మేడిపల్లి మీదుగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటికి 100 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేడిపల్లికి చెందిన పొద్దుటూరి రవీందర్గుప్తా అన్నారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఇప్పటికి కేవలం రెండు బ్రిడ్జిలు మాత్రమే నిర్మించి వదిలేశారు. రోడ్డుకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ నిర్మాణంలోనే పనులు నిలిచిపోవడం గమనార్హం. ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై దృష్టి సారించి మేడిపల్లి-నందివనపర్తి లింకు రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించేందకు అన్ని విధాలుగా కృషి చేయాలి. లేదంటే ఆందోళన చేయాల్సి వస్తుందన్నారు.