కొడంగల్, జనవరి 29 : బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అప్పట్లో కొడంగల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గం అన్నింటా వెనుబడి పోయిందని ఆయా గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి చేసుకొన్నప్పటికీ గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేకుండా పోయాయని తెలిపారు. గత నాలుగేండ్ల నుంచి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవ్గంలోని ప్రతి గ్రామానికీ బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తుండడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే గ్రామ ప్రజలు నాయకులకు గుర్తుకు రావడం, గెలుపుకోసం హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మర్చిపోవడం అప్పటి రాజకీయాల సంస్కృతిగా ఉండేదని, నేడు సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనలో ప్రజల అవసరాన్ని గుర్తించి వాటిని సమకూర్చడం బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనతగా పేర్కొంటున్నారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మున్సిపల్తో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడుతున్నారు. రూ.కోట్ల నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు మంజూరు చేయడంతో పాటు పనులు పూర్తి చేయిస్తున్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలోని ఐనాన్పల్లి గ్రామం ఎన్హెచ్ 163 రోడ్డుకు ఆనుకొని ఉం టుంది. ఉన్న కొద్ది దూరం రోడ్డు పూర్తిగా కంకర తేలడంతో పాటు గుంతలమయంగా ఉండడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. గతంలోని పాలకులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని గ్రామానికి రూ.80లక్షలతో బీటీ రోడ్డును మంజూరు చేయించడంతో పాటు నిర్మాణ పనులు పూర్తి చేయించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఎమ్మెల్యే సహకారంతో కల సాకారం
ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి హయాంలో మా గ్రామానికి బీటీ రోడ్డు వచ్చింది. బీటీ రోడ్డు నిర్మాణంతో మా గ్రామానికి కళ వచ్చింది. మా గ్రామానికి బీటీ రోడ్డు వస్తుందని అనుకోలేదు. ఏళ్ల నాటి కల తీరడం చాలా సంతోషంగా ఉంది. మా గ్రామానికి బీటీ రోడ్డు, గ్రామంలో సీసీ రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం..
– లక్ష్మారెడ్డి, గ్రామస్తుడు, ఐనాన్పల్లి, కొడంగల్