నందిగామ, జూలై 8 : పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ప్రతి ఒక్క సామాన్యుడు పిల్లలు, కుటుంబం బాగుండాలని కోరుకోవడంతో పాటు ఉండేందుకు ఒక నివాసం ఉండాలని కోరుకుంటారు. ఆ నిరుపేదల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చుతున్నది. సామాన్య ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సొంత జాగ కొని ఇల్లు కట్టే పరిస్థితుల్లో లేరు. సామాన్య ప్రజలు కష్ట నష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ దూరదృష్టితో అలోచించి దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలకు అందించి పేదల సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు.
నందిగామలో 120 ఇండ్ల నిర్మాణం..
నందిగామ మండల కేంద్రంలోని పాత జాతీయ రహదారి సమీపంలో డబుల్బెడ్ రూం ఇడ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. రెండెకరాల స్థలంలో డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ.6,04,80,000లను మంజూరు చేసింది. దీంతో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ 120 డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జీ+2లెవల్లో ఐదు బ్లాకులుగా 120 డబుల్బెడ్ రూం ఇండ్లను నిర్మించారు.
100 మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి..
నందిగామలో 120 డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రభుత్వ అదేశాల మేరకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. అర్హులైన 100 మంది లబ్ధిదారులకు అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించారు. మరో 20 మంది లబ్ధిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన వెంటనే డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
సొంత ఇంటి కల నెరవేరింది
ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఎన్నో రోజులుగా పాడుబడిన ఇంట్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నాం. సొంత ఇల్లు కట్టుకుని ఉండాలనే ఎన్నో ఏండ్ల కలను ప్రభుత్వం నేరవేర్చింది. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూం ఇల్లు తనకు రావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కుంటుంబ సభ్యులందరం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– జంగారి లక్ష్మి, లబ్ధిదారురాలు, నందిగామ
రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు
సొంత ఇల్లు లేదు. గ్రామ పంచాయతీలో కార్మికురాలిగా పని చేసుకుంటూ వచ్చిన జీతంతో బతుకుతున్న. అధికారులు మా దగ్గరికి వచ్చి చూసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..
– పబ్బె కళమ్మ, లబ్ధిదారురాలు, నందిగామ