ఇబ్రహీంపట్నం, జూలై 18 : రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. రోజురోజుకూ ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంలేక కేడర్ చేజారిపోతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఉంటూ.. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి పార్టీ నాయకత్వంపై క్రమంగా నమ్మకం సన్నగిల్లుతున్నది. దీంతో విసుగుచెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన మల్రెడ్డి రంగారెడ్డి స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యాడు. గత మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గ విబేధాలు ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమవుతున్నాయి. దీంతో రోజురోజుకూ ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు పెరిగిపోతుండటంతో కేడర్లో నమ్మకం సన్నగిల్లుతున్నది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ క్రమంగా చేజారి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
నియోజకవర్గ కాంగ్రెస్లో మూడుముక్కలాట
నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరిగిపోతున్నది. ఎవరికి వారే కాంగ్రెస్పార్టీ అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటూ కేడర్ను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇబ్రహీంపట్నం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తమకే వస్తుందంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ తనకే ఖరారైందని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెబుతుండగా.. ఎంపీ కోమటిరెడ్డి ఆశీస్సులతో టికెట్ తనకే వస్తుందంటూ మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్రెడ్డి ధీమాగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి సహకారంతో టికెట్ తనకే వస్తుందని టీపీసీసీ నాయకుడు దండెం రాంరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు బీసీలకు టికెట్ కేటాయిస్తే.. తమకే వస్తుందని ఈసీ శేఖర్గౌడ్, కొత్తకుర్మ శివకుమార్ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలంతా ఎవరికి వారే గ్రూపులను ప్రోత్సహించి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఈసారి కూడా లేనట్టే.. ఇప్పటికే మూడు పర్యాయాలు గ్రూపు తగాదాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. పార్టీలో నెలకొన్న గ్రూపులను సమన్వయపర్చడానికి నాయకత్వం ఎలాంటి శ్రద్ధ చూపటంలేదు.
పార్టీకి షాక్ ఇవ్వనున్న నాయకులు, కౌన్సిలర్లు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉంది. కానీ, నాయకత్వంపై నిరుత్సాహంతో ఆ మున్సిపాలిటీలో బలమైన నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్లో చేరడానికి సిద్ధమైన వారిలో మాజీ ఎంపీపీ రొక్కం భీంరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జక్క రాంరెడ్డి, మరో సీనియర్ నాయకుడు గుర్రం శేఖర్రెడ్డి, తుర్కయాంజాల్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు నర్సింహారెడ్డి, మరియమ్మ, కౌన్సిలర్లు అనిత, కవితా శేఖర్గౌడ్, మర్రి మాధవి మహేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీలత గౌతమ్రెడ్డితో పాటు మాజీ సర్పంచ్లు మల్లేశ్, నర్సింహారెడ్డి, జేమ్స్, లలిత, మేతరి అంజయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ యాదగిరిరెడ్డి, మేతరి అశోక్, లక్ష్మమ్మ, భిక్షపతియాదవ్ తదితరులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నిరుత్సాహంతో బీఆర్ఎస్లో చేరనున్నారు.
బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న వలసలు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతోపాటు ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీల పరిధిలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. కాగా, మరికొంతమంది ఆ పార్టీల నాయకత్వంపై నమ్మకంలేక బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా మారుతున్నది.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి..
– మాజీ ఎంపీపీ రొక్కం భీంరెడ్డి
– 800 మంది కార్యకర్తలతో బీఆర్ఎస్లోకి..
తుర్కయాంజాల్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో చేరనున్నట్లు హయత్నగర్ మండల మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రొక్కం భీంరెడ్డి ప్రకటించారు. మంగళవారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కమ్మగూడ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని.. అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలనే ఉద్దేశంతోనే బుధవారం స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో సుమారు 800 మందితో బీఆర్ఎస్లో చేరనున్నట్లు ఆయన తెలిపారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ నుంచి 10 మంది కౌన్సిలర్లు, ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సహకార సంఘం మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లతో పాటు పార్టీలో చేరుతానని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.