సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : మూసీ పరీవాహక ప్రాంత సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎంవో అధికారులు దేశ, విదేశాల్లోని నదీ తీర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను స్యయంగా పరిశీలించి, అధ్యయనం చేశారు.
జనవరి 2న మూసీ సుందరీకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే 3 నెలల్లోగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో సమావేశం జరిగిన రెండు రోజుల్లో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీరివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లింది. ఆ నగరంలో సబర్మతి నదీతీర ప్రాంతాన్ని అధ్యయనం చేశారు.
ఆ తర్వాత ఈ నెల 13న ఆమె లండన్ పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ముగించుకొని తన బృందంతో పాటు లండన్ వెళ్లి అక్కడి థేమ్స్ నదీ తీరంలో చేపట్టిన అభివృద్ధిపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత వెంటనే దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఇలా 20 రోజులలో మూడు కీలకమైన నదితీర ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులను సీఎంతో పాటు ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేసి వచ్చింది.