షాబాద్, మే 17 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సీఎం కప్-2023 మండల స్థాయి పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 15నుంచి 17వరకు మండల స్థాయిలో వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. మండల స్థాయిలో అథ్లెటిక్స్ (100-400 మీటర్లు), వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బుధవారం ఎమ్మెల్యేలు, మం డల స్థాయి ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల 22 నుంచి 24వరకు జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పా ల్గొనే అవకాశం కల్పిస్తారు. జిల్లా స్థాయిలో విజేతలను 28 నుంచి 31వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తారు. జిల్లా స్థాయిలో 11 రకాలు, రాష్ట్ర స్థాయిలో 18 రకాల క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు సీఎం కప్ పేరుతో నగదు బహుమతులు అందజేయనున్నారు. గ్రామీణ యు వతను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడాపోటీలతో యువత హర్షం వ్యక్తం చేస్తున్నది. ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకుంటున్నారు.