చేవెళ్ల రూరల్, జనవరి 28: బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. చేవెళ్ల మండల పరిధిలోని కందవాడ, అనుబంధ గ్రామం నారాయణ్దాస్గూడలో పల్లె ప్రగతి పనులు పూర్తి చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.
పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం
కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నది. ప్రభుత్వం గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నది. కందవాడ గ్రామపంచాయతీలో గతంలో పేరుకుపోయిన సమస్యలు పల్లె ప్రగతి పనులతో పరిష్కరించబడ్డాయి.
మౌలిక వసతుల కల్పన
కందవాడ (నారాయణ్దాస్గూడ అనుబంధ గ్రామం) గ్రామ జనాభా 2051, ఓటర్లు 2200 మంది ఉన్నారు. సర్పంచ్ శేరి అరుంధతి, గ్రామపంచాయతీ కార్యదర్శి మన్మోహన్ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
చేపట్టిన అభివృద్ధి పనులు
కందవాడ (నారాయణ్దాస్గూడ అనుబంధ గ్రామం)లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, సీసీ కెమెరాలు, గ్రామపంచాయతీలో ట్రాక్టర్, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తున్నారు.
తొలగిన ఇబ్బందులు
గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటుతో గతంలో ఏర్పడ్డ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. పారిశుధ్య నిర్వహణలో రాజీలేకుండా సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో వేసి డంపిండ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆహ్లాదాన్నిస్తున్న చెట్లు
ప్రధాన రహదారికి ఇరువైలా, గ్రామ పరిసరాలు, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నేడు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కల సంరక్షణకు పంచాయతీ పాలకవర్గం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు.
అందరి భాగస్వామ్యంతోనే.. రాజ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో, చేవెళ్ల
ప్రజల భాగస్వామ్యముంటే గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోవడానికి అవకాశము ంటుంది. మండలంలోని అన్ని పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం గ్రీనరీ పెంపునకు కృషి చేస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలి.
పచ్చదనం, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ: శేరి అరుంధతి, సర్పంచ్
పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారం, అధికారుల పర్యవేక్షణతోనే గ్రామంలో అభివృద్ధి సాధ్యమైంది. గ్రామ సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే అప్పటికప్పుడే పరిష్కారం చూపుతున్నాం. పచ్చదనం, పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం: మన్మోహన్, పంచాయతీ కార్యదర్శి
ఏండ్ల నాటి సమస్యలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో తొలగిపోయాయి. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
గ్రామాలకు అధిక నిధులు: గౌండ్ల కావ్య, ఉపసర్పంచ్
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయి. పంచాయతీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు. గతంలో ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు.