సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రానున్న అసెంబ్లీ ఎన్నికలను సాఫీగా నిర్వహించేందుకు పోలీసులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఎక్సైజ్, పోలీసు అధికారులతో కలిసి నిర్వహించిన సమన్వయ సమావేశంలో సీపీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారులతో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు నల్లబెల్లం, అక్రమ మద్యం రవాణా జరగకుండా నిఘా పెట్టాలని సూచించారు.
ప్రతి రోజు జరిగే మద్యం అమ్మకాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని ఆబ్కారీ అధికారులకు సీపీ సూచించారు. ముఖ్యంగా బెల్టు షాపులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, ఆబ్కారీ అధికారులకు సూచించారు. ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లతో పాటు ఇతర ప్రాంతాల్లో అక్రమంగా మద్యం నిల్వలు చేసే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని, అక్రమంగా మద్యం నిలువ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు ఈవెంట్ల కోసం మద్యం వినియోగానికి ఇచ్చే అనుమతులపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో మద్యం అనుమతులు ఇవ్వకూడదని సీపీ అధికారులకు సూచించారు.
కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన అన్ని చెక్పోస్టుల వద్ద పోలీసులతో పాటు ఎక్సైజ్ అధికారులు సైతం తనిఖీల్లో పాల్గొని, అక్రమ మద్యం, మత్తు పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఆధారాలు లేకుండా నగదు రూ.50వేల కంటే ఎక్కువ నగదు, బంగారం వంటి వాటిని తరలించవద్దని సీపీ సూచించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ అదనపు కమిషనర్ అవినాష్ మహంతి, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డెవిడ్ రవికాంత్, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, రాజేంద్రగన్ డీసీపీ జగదీశ్వర్, శంషాబాద్ డీసీపీ కె.నారాయణ, మాదాపూర్ డీసీపీ సందీప్, ఎలక్షన్ సెల్ డీసీపీ అశోక్కుమార్, రంగారెడ్డి జిల్లా ఆబ్కారీ ఏసీ చంద్రయ్య, శంషాబాద్ ఆబ్కారీ అధికారి సత్యనారాయణ, మేడ్చల్, సరూర్నగర్, మల్కాజిగిరి డీపీఈఓలు విజయభాస్కర్, రవీందర్, అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.