వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులను అందజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నది. బాధితులకు ఎలాంటి చింత లేకుండా ఇంటి వద్దకే వెళ్లి బీపీ, షుగర్ కాంబినేషన్ కిట్స్ను వైద్య సిబ్బంది అందజేస్తున్నది. మూడేండ్లుగా ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీల్లోనే మందులను పంపిణీ చేస్తుండగా, రాష్ట్ర వైద్య శాఖ ఆదేశాల మేరకు గత నెల నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో బీపీ బాధితులు 69,795, షుగర్ వ్యాధిగ్రస్తులు 29,497 మంది ఉండగా, బీపీ, షుగర్ కలిపి ఉన్న 6 వేల మందికి కాంబినేషన్ డ్రగ్స్ను ఆశవర్కర్లు ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నారు. ఒక్కొక్కరికీ ప్రతి నెలా సుమారు రూ.3 వేలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. కాంబినేషన్ డ్రగ్స్ వాడటం వల్ల బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వచ్చినట్లు బాధితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– వికారాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా ముందుకెళ్తున్నది. ఇప్పటికే డయాలసిస్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నది. గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ ప్రక్రియ చేసుకోవాలంటే అధిక ఖర్చును భరించలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలున్నాయి. ప్రభుత్వం పేద ప్రజల పరిస్థితిని చూసి జిల్లాలో మూడు డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు పరిగిలో కూడా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ వేగవంతమైనది. డయాలసిస్, డయాగ్నోస్టిక్ కేంద్రాలతోపాటు ఈ మధ్యన చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడుతున్న వారిపై దృష్టి సారించింది.
పదేండ్ల క్రితం వరకు వెయ్యి మందిలో ఐదారుగురికి బీపీ, షుగర్ ఉండగా, ప్రస్తుతం ప్రతి పది మందిలో ఐదారుగురు బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా, సంబంధించిన మందులు వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం క్రమంగా పెరిగి ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయి. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మూడేండ్లుగా ప్రభుత్వమే ఉచితంగా అవసరమైన మందులను అందజేస్తున్నది. ఎన్సీడీ(నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్-అసంక్రమిత వ్యాధులు) అనే కార్యక్రమం కింద బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ కార్యక్రమాన్ని అమలుకుగాను ప్రత్యేకంగా ఒక ఆశ వర్కర్ను కూడా నియమించి అమలుచేస్తున్నారు. ఎన్సీడీ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి బీపీ, షుగర్ బాధితులకు నెలకు ఒక్కొక్కరికీ రూ.3వేల వరకు ప్రభుత్వమే భరిస్తున్నది. జిల్లాలో బీపీ బాధితులు-69,795 మంది ఉండగా, షుగర్ వ్యాధిగ్రస్తులు 29,497 మంది ఉన్నారు.
బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఇప్పటివరకు బీపీ, షుగర్ బాధితులకు సింగిల్ డ్రగ్స్ను బీపీ, షుగర్ వ్యాధులకు అందజేసిన ప్రభుత్వం, గతనెల నుంచి బీపీ, షుగర్ బాధితులకు కాంబినేషన్ డ్రగ్స్ను అందజేస్తుంది. బీపీ, షుగర్ ఉన్న వారు ప్రత్యేకంగా బీపీకి, షుగర్కు మందులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా కాంబినేషన్ డ్రగ్స్ను ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్నారు. కాంబినేషన్ డ్రగ్స్తో సత్ఫలితాలొస్తున్నాయి. గతంలో బీపీ, షుగర్ లెవల్స్ ఎక్కువున్న వారు కాంబినేషన్ డ్రగ్స్ వాడిన ఒక్కనెలలో నియంత్రణలోకి వచ్చినట్లు బాధితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశాల మేరకు కాంబినేషన్ డ్రగ్స్ పనితీరుపై జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేటగ మండలాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పల్వన్కుమార్ పర్యటించి, కాంబినేషన్ డ్రగ్స్ వాడుతున్న ప్రజలతో కాంబినేషన్ డ్రగ్స్ ఏ విధంగా పనిచేస్తుంది, గతంలో బీపీ, షుగర్ లెవల్స్ ఏ విధంగా ఉండేది, ప్రస్తుతం ఏ విధంగా ఉందనే వివరాలను సేకరించారు. కాంబినేషన్ డ్రగ్స్ వాడుతున్న వారిలో షుగర్ లెవల్స్తో బీపీ తగ్గుతున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లావ్యాప్తంగా కాంబినేషన్ డ్రగ్స్ వాడుతున్న వారు 6 వేల మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
జిల్లాలో బీపీ, షుగర్ బాధితులు 99,292 మంది ఉన్నారు. వీరందరికీ జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా బీపీ, షుగర్ మందులను పంపిణీ చేస్తున్నారు. ఎన్సీడీ కార్యక్రమం అమలుకుగాను ప్రత్యేకంగా నియమించిన ఆశా వర్కర్లు ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటింటికెళ్లి సర్వే నిర్వహించి, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి బాధితుల వివరాలను జిల్లా ప్రోగ్రామ్ అధికారికి అందజేస్తూ వస్తున్నారు. ఆశా వర్కర్లు అందజేసే బీపీ, షుగర్ బాధితుల డేటా ప్రకారం జిల్లాలోని ఆయా పీహెచ్సీలకు బీపీ, షుగర్ మందులను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సరఫరా చేస్తున్నారు. మూడేండ్లుగా బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా పీహెచ్సీల్లోనే మందులను పంపిణీ చేస్తుండగా, గతేడాది నుంచి ఇంటింటికీ వెళ్లి ఆశ వర్కర్లు బాధితులకు బీపీ, షుగర్ మందులను పంపిణీ చేస్తున్నారు. బీపీ, షుగర్ బాధితులకు నెలరోజులకు సరిపడా మందులను ఒకేసారి ఇంటికెళ్లి అందజేస్తున్నారు. నెలకు సరిపడా మందులతోపాటు ఆ మందులను ఎలా వాడాలనే వివరాలతో కూడిన సమాచార కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు బీపీ, షుగర్ బాధితులకు కూడా ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయా లేదనేది పరిశీలించే బాధ్యతను ఆశ వర్కర్లకు అప్పగించారు. 35ఏండ్లు దాటిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, నిర్దారణ మందులను అందజేస్తున్నారు. మెజార్టీ బాధితులు ప్రభుత్వం అందించే ఉచిత మందులను వాడుతుండడం గమనార్హం.
జిల్లాలోని బీపీ, షుగర్ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా మందులను ఇంటింటికీ వెళ్లి అందజేస్తున్నది. గతనెల నుంచి బీపీ, షుగర్ ఉన్న వారికి ప్రత్యేకంగా కాంబినేషన్ డ్రగ్స్ను కూడా సరఫరా చేస్తున్నది. కాంబినేషన్ డ్రగ్స్తో చాలా మందిలో బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తున్నది.
– పల్వన్కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి