బండ్లగూడ, ఏప్రిల్ 16 : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తామని రంగారెడ్డి కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 2877 పోలింగ్ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నామినేషన్ల దాఖలు 25 వరకు కొనసాగుతుందన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 27 నుంచి 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మద్యం, నగదు నియంత్రణకు పక్కాగా చర్యలు
ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీకి తావు లేకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శశాంక పేర్కొన్నారు. ఏడు అసెంబ్లీ నియోజవర్గాల పరిధిలో 21 టీమ్లు పని చేస్తున్నాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో 13,443 మంది పాల్గొంటున్నట్లు వివరించారు. మూడు షిఫ్టుల్లో పార్లమెంటు పరిధిలో నిరంతర తనిఖీలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడుత ఈవీఎం రాండమైజేషన్ పూర్తయిందన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ఈవీఎంలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో గత ఎన్నికల్లో జరిగిన తప్పులకు అవకాశం ఇవ్వబోమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నెల 23 వరకు వృద్ధులు, దివ్యాంగుల నుంచి పోస్టల్ బ్యాలెట్లు సేకరిస్తామన్నారు.
ఓటర్లలో అవగాహన కల్పిస్తున్నాం
ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయం కలిగినవారు పోలింగ్ ప్రక్రియలో సరిగ్గా పాలుపంచుకోవడం లేదని కలెక్టర్ శశాంక తెలిపారు. పోలింగ్ శాతం పెరిగేందుకు అన్ని అవగాహన చర్యలు చేపట్టినట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 25 వేల పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయన్నారు. కౌంటింగ్ చేవెళ్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చేవెళ్ల అయితే మిగతా ఏడు నియోజకవర్గాలకు మధ్యలో ఉంటుందనే భావనతో అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాజకీయపక్ష నేతల అభిప్రాయం కూడా సేకరించినట్లు వివరించారు. ఇప్పటికే రాజేంద్రనగర్లోని తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకటరెడ్డి, తహసీల్దార్ రాములు, పలువురు అధికారులు పాల్గొన్నారు.