రంగారెడ్డి, మార్చి 11(నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం రాజేంద్రగర్ ఆర్డీవో కార్యాలయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.
జిల్లాలో 237 పరీక్షాకేంద్రాల్లో 50,946 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలను భద్రపర్చేందుకు 37 పోలీస్ స్టేషన్ల గుర్తించడం జరిగిందన్నారు. కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మొబైల్ డెస్ ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు నిర్వహించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలన్నారు. కేంద్రాల వద్ద అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆశ వరర్, ఏఎన్ఎంలను ఇతర సిబ్బందిని నియమించాలని వైద్యాధికారికి సూచించారు.
ఫర్నిచర్ , తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని బస్సులను నడిపించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సరైన సమయంలో చేరుకునేలా ఉదయం పరీక్షకు గంట ముందు బస్సులు నడపాలని, పరీక్ష రాసిన తర్వాత ఇండ్లకు చేరుకునేలా బస్సులు నడపాలని సూచించారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నాపత్రాలు కేంద్రాలకు చేరాలన్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు వీలుగా ఫ్లెయింగ్ స్వాడ్, సిట్టింగ్ స్వాడ్లను నియమించినట్లు పేర్కొన్నారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు చూడాలని, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మహిళా కానిస్టేబుల్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, భూపాల్రెడ్డి, డీఆర్వో సంగీత, జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్రావు, పోలీసు అధికారులు, ఆరోగ్య, ఆర్టీసీ శాఖల అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.